కుర్చీల అంచున 18 నిమిషాల విశ్రాంతి

ఇంకో అయిదు రోజుల్లో థియేటర్లో అడుగు పెట్టబోతున్న యానిమల్ కోసం ప్రేక్షకుల ఎదురు చూపులు మాములుగా లేవు. హిందీ తర్వాత ఆ స్థాయి బజ్ తెలుగు రాష్ట్రాల్లోనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇవాళ జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు, రాజమౌళి హాజరయ్యాక ఇది నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయమే. తాజాగా చెన్నైలో ప్రమోషన్ చేసుకుని వచ్చిన ఈ టీమ్ నుంచి కొన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ చాలా హాట్ గా ఉన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ చెబుతున్న దాని ప్రకారం ఏకధాటిగా 18 నిమిషాల పాటు ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుందట.

ఇంత సుదీర్ఘమైన విశ్రాంతి ఘట్టం గతంలో ఏ సినిమాలోనూ వచ్చినట్టు లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రన్బీర్ కపూర్ సిక్కుల గెటప్పులో ఉన్న అనుచరులను తీసుకొచ్చి మెషీన్ గన్ తో సృష్టించే విధ్వంసం దీని గురించేననట. సూటు బూటుకి భిన్నంగా తెల్లని లాల్చీతో దుస్తుల నిండా రక్తం పూసుకుని హీరో చేసే అరాచకం మాటల్లో వర్ణించలేమని అంటున్నారు. ప్రణయ్ కేవలం నిడివి గురించి మాత్రమే చెప్పగా టీమ్ నుంచి అందుతున్న అనఫీషియల్ లీక్స్ అంతకు మించి ఉన్నాయి. సుప్రీమ్ సుందర్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ హాలీవుడ్ స్టాండర్డ్ ని మించే ఉంటుందట.

ఇంతగా ఊరిస్తే మొదటిరోజు చూడకుండా ఉండటం కష్టమే. సందీప్ వంగా ఇంటర్వ్యూలతో పాటు పక్కా ప్లానింగ్ తో టి సిరీస్, భద్రకాళి బ్యానర్లు సంయుక్తంగా చేస్తున్న పబ్లిసిటీ యానిమల్ కి కోరుకున్న దానికన్నా ఎక్కువ హైప్ తెచ్చేసింది. మల్టీప్లెక్సుల టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి. సల్మాన్ ఖాన్ టైగర్ 3కి ఇంత దూకుడు చూడలేదని బయ్యర్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఉదయం ఆటకు పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం బాక్సాఫీస్ ఉచకోత మాములుగా ఉండదు. రష్మిక మందన్న, అనిల్ కపూర్, పృథ్వి, శక్తి కపూర్ ఇతర ప్రధాన తారాగణం కాగా బాబీ డియోల్ విలనీకి చాలా క్రేజ్ వచ్చేసింది.