పరశురామ్‌తో గొడవపై బన్నీ వాసు

యువ దర్శకుడు పరశురామ్‌కు, గీతా ఆర్ట్స్‌కు ఉన్న అనుబంధమే వేరు. ‘సారొచ్చారు’తో పెద్ద ఫ్లాప్ ఎదుర్కొని కష్టాల్లో ఉన్న సమయంలో గీతా ఆర్ట్స్ అతడికి అవకాశమిచ్చింది. అతను కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అల్లు అరవింద్ తనయుడు శిరీష్‌కు ఓ మంచి విజయాన్ని అందించాడు. తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ తీసిన ‘గీత గోవిందం’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. గీతా సంస్థకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమాతో పరశురామ్ రేంజ్ కూడా మారింది. మహేష్ బాబుతో సినిమా చేసే స్థాయికి వెళ్లాడు.

ఐతే ‘సర్కారు వారి పాట’ తర్వాత పరశురామ్.. గీతా సంస్థలోనే విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ అతను అనూహ్యంగా దిల్ రాజు కాంపౌండ్లో తేలాడు. విజయ్‌తోనే సినిమా ఓకే అయింది.

ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ బాగా హర్టయ్యాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒక ఈవెంట్లో పరోక్షంగా పరశురామ్ మీద ఆయన విమర్శలు కూడా చేశారు. ఈ వ్యవహారంపై అరవింద్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా సిద్ధమైనట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఏమైందో తెలియదు. ఆ గొడవ గురించి ఇప్పుడు గీతా ఆర్ట్స్-2 అధినేత బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

“గీత గోవిందం తర్వాత విజయ్-పరశురామ్ కాంబినేషన్లో ఇంకో సినిమా చేయాలనుకున్నాం. అందుకోసం ఒక కథ కూడా అనుకున్నాం. అదే సమయంలో విజయ్ ఫోన్ చేసి పరశురామ్ చెప్పిన ఇంకో కథ తనకు నచ్చిందని.. దిల్ రాజు బేనర్లో అది చేస్తానని అన్నాడు. ఈ విషయంలో నన్ను, అరవింద్ గారిని ఎంతగానో బాధించింది. పరశురామ్ ఈ విషయాన్ని మాతో సరిగా కమ్యూనికేట్ చేయలేదు. విషయం అతడి ద్వారా కాకుండా వేరే మార్గంలో తెలవడంతో మేం హర్టయ్యాం. అప్పుడు మేమంతా వేడి మీద ఉన్నాం. అందుకు తగ్గట్లే రియాక్టయ్యాం. తర్వాత పరశురామ్ ఫోన్ చేసి.. తాను 14 రీల్స్ బేనర్లో ఉండగా అనుకున్న లైన్‌ను ఫ్లోలో దిల్ రాజుకు చెబితే.. ఆయన సినిమా ఓకే చేశాారని.. విజయ్‌కి కూడా కథ నచ్చి సినిమా చేయడానికి రెడీ అయ్యాడని.. ఆ విషయం తాను పొద్దున చెబుదాం అనుకునేలోపు ఇలా అయిపోయిందని వివరణ ఇచ్చాడు. తర్వాత దిల్ రాజు గారు ఫోన్ చేసి, నీకీ సినిమాలో వాటా కావాలంటే తీసుకో అన్నారు. కానీ అరవింద్ గారే.. అలా వద్దని చెప్పారు. ఇప్పుడు అంతా సద్దుమణిగింది. విజయ్, పరశురామ్ కాంబినేషన్లో మేం సినిమా చేస్తాం” అని బన్నీ వాసు తెలిపాడు.