అతడు పూరీకి త్రివిక్రమ్ పిలుపు ?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సినిమాల్లో అతడుది ప్రత్యేక స్థానం. థియేట్రికల్ గా పోకిరి రేంజ్ లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టలేదు కానీ కమర్షియల్ గా సేఫ్ అయ్యాక బుల్లితెరపై ఓ రేంజ్ లో అదరగొట్టింది. శాటిలైట్ చరిత్రలో అత్యథిక రిపీట్ వేల్యూ కలిగిన చిత్రంగా టీవీ వర్గాలు దీని గురించి ప్రత్యేకంగా చెబుతుంటాయి. మహేష్ బాబుకి ఎంత పేరు వచ్చిందో అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. హీరోయిన్ త్రిష మరదలు పూరిగా చేసిన క్యారెక్టర్ మంచి ఫేమ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా పార్ధుకి తనకు మధ్య వచ్చే టీజింగ్ సీన్స్ నవ్వించడమే కాదు కవ్వించాయి.

తర్వాత త్రిషతో మళ్ళీ త్రివిక్రమ్ కాంబో సాధ్యపడలేదు. 2005 అతడు తర్వాత కలుసుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత మరోసారి చేతులు కలిపే ఛాన్స్ ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉన్న మాటల మాంత్రికుడు అది పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ స్క్రిప్ట్ పనులు మొదలుపెడతారు. ఎంతలేదన్నా దీనికి ఏడాది పడుతుందని ఈ మధ్య బన్నీ వాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే 2025 కన్నా ముందు షూట్ మొదలయ్యే ఛాన్స్ లేదు. పుష్ప 2 ఆగస్ట్ లో రిలీజయ్యాక బన్నీ దీని మేకోవర్ కోసం రెడీ అవుతాడు.

ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోయే ఈ సినిమాలో హీరోయిన్ సమానమైన ప్రాధాన్యత కలిగిన పాత్రను త్రిషకు ఆఫర్ చేయొచ్చని వినికిడి. ఈ మధ్యే త్రిష ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. పొన్నియిన్ సెల్వన్, లియోలో తనను చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. నాలుగు పదుల వయసులోనూ అందంతో వావ్ అనిపిస్తోంది. సో బన్నీతో జోడి కడితే బాగుంటుంది. అయితే మెయిన్ హీరోయిన్ వేరే ఉంటుందట. ఎవరనేది మాత్రం ఇంకా ఆలోచించలేదు. ఇంత అడ్వాన్స్ గా త్రిషను ట్రై చేస్తున్నారంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో పెద్ద ప్లానింగ్ లో ఉన్నట్టే కనిపిస్తోంది. అధికారికంగా వచ్చేదాకా ధృవీకరించలేం.