అందరి లైనప్ బాగుంది.. చిరుదే

Chiranjeevi Fans

టాలీవుడ్ టాప్ స్టార్లు చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నారు. తమ ఇమేజ్‌ను, ఫాలోయింగ్‌ను పెంచేలా, మార్కెట్‌ను విస్తరించేలా కాంబినేషన్లు ఎంచుకుంటున్నారు. ఈ విషయంలో లాక్ డౌన్ వాళ్లకు బాగా ఉపయోగపడింది. బోలెడన్ని కథలు విని.. అందులోంచి బెస్ట్ అనుకున్నవే ఓకే చేశారు.

‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్.. దాని తర్వాత ‘సాహో’తో ఎదురు దెబ్బ తిన్నాడు. ‘రాధేశ్యామ్’ విషయంలోనూ అభిమానులు సంతృప్తిగా అయితే లేరు. కానీ దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక సినిమా.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ లాంటి చారిత్రక సినిమా ప్రకటించడంతో ఇవి రెండూ అభిమానుల్నే కాక అందరినీ ఎగ్జైట్ చేశాయి. ఈ ప్రాజెక్టులు ప్రకటించాక ప్రభాస్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరనిపించింది.

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. పరశురామ్‌ను నమ్మి ‘సర్కారు వారి పాట’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీని టైటిల్ దగ్గర్నుంచి అన్నీ పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. దాని తర్వాత రాజమౌళి సినిమా లైన్లో ఉంది మహేష్ కోసం. మధ్యలో ఇంకేదైనా సినిమా చేస్తాడేమో తెలియదు.

పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ‘పింక్’ రీమేక్‌తో ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు కొంత రుచించలేదు కానీ.. క్రిష్ సినిమాతో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు ఓకే కావడంతో అభిమానులు సంతోషంగానే ఉన్నారు. అల్లు అర్జున్ విషయానికి వస్తే సుకుమార్‌తో ‘పుష్ప’ లాంటి ఎగ్జైటింగ్ మూవీ చేస్తున్నాడు.

ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండూ చాలా ఆసక్తికరమైన ప్రాజెక్టులే. ఇక ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ లాంటి టాప్ డైరెక్టర్లతో సినిమాలు ఓకే చేసుకుని మంచి లైనప్ సెట్ చేసుకున్నాడు. రామ్ చరణ్ సంగతే తేలాల్సి ఉంది.

ఐతే పై హీరోలందరితో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి లైనప్పే అభిమానులకు రుచించట్లేదు. ప్రస్తుతం నటిస్తున్న ‘ఆచార్య’ మీద మంచి అంచనాలున్నాయి కానీ.. దాని తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ చేయబోతున్నాడు. ఆపై మెహర్ రమేష్ లాంటి డిజాస్టర్ డైరెక్టర్‌తో ‘వేదాళం’ రీమేక్ అంటున్నారు.

ఇంకో వైపు రొటీన్ సినిమాలు తీస్తాడని పేరున్న బాబీతో ఓ సినిమా ఓకే చేశాడంటున్నారు. ఈ లైనప్ ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించడం లేదు. లాక్ డౌన్ టైంను మిగతా హీరోలందరూ చక్కగా ఉపయోగించుకుని టాప్ డైరెక్టర్లతో ఎగ్జైటింగ్ ప్రాజెక్టులు లైన్లో పెడితే చిరు మాత్రం ఇలా సాదాసీదా సినిమాలను ఓకే చేయడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.