మైత్రి మేకర్స్ చేతికి అజిత్ సినిమా

మాములుగా మన నిర్మాతలు కోలీవుడ్ లో జెండా పాతడం అరుదు. అందులోనూ అక్కడి స్టార్ హీరోల డేట్లు సంపాదించడం చాలా కష్టం. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు సక్సెస్ సాధించారు. విజయ్ తో తీసిన వరిసు(వారసుడు) కమర్షియల్ గా టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలవడం ఆయన జెండా పాతే ప్రోగ్రాంలో మొదటి మెట్టుగా నిలిచింది. కంటెంట్ సంగతి ఎలా ఉన్నా వర్కౌట్ చేసుకున్న మాట వాస్తవం. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలుగుతున్న మైత్రి మూవీ మేకర్స్ తమిళ అగ్ర హీరో, ఫ్యాన్స్ అభిమానంతో తలా అని పిలుచుకునే అజిత్ తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నారట.

దీనికి దర్శకుడిగా ఆధిక్ రవిచంద్రన్ ఫిక్సయినట్టుగా సమాచారం. మనకు అంతగా పరిచయం లేదు కానీ ఇటీవలే విశాల్ తో మార్క్ ఆంటోనీ తీసింది ఇతనే. తెలుగులో అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ ఘనవిజయం సాధించింది. అరవ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీయడంతో వంద కోట్ల క్లబ్బులో చేరింది. ఈ రవిచంద్రన్ కి అజిత్ అంటే విపరీతమైన అభిమానం, పిచ్చి. దాన్ని మొదటి చిత్రం త్రిష ఇల్లన నయనతార నుంచి మార్క్ ఆంటోనీ దాకా బయట పెట్టుకుంటూనే వచ్చాడు. ఇప్పుడు తన దేవుడిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కడంతో తల పీక్స్ చూపిస్తాడట.

ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ మొత్తానికి కాంబో లాక్ అయినట్టు వినికిడి. నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, వ్యాపార పరిధిని అన్ని భాషలకు విస్తరించాలని చూస్తున్న మైత్రికి అజిత్ మూవీ మంచి బూస్ట్ అవుతుంది. ఆయన నటించేది తక్కువ సినిమాలే అయినా మార్కెట్ పరంగా కనీసం రెండు వందల కోట్ల వరకు లాక్కు రాగలిగిన స్టామినా ఉంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ పడిందంటే మాత్రం విక్రమ్, జైలర్, లియోలను ఈజీగా దాటే కెపాసిటీ అజిత్ కుంది. అద్విక్ రవిచంద్రన్ రాసుకున్న కథ యాక్షన్ ఎంటర్ టైనరట. మరి పక్కరాష్ట్రంలో మైత్రి అడుగులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.