షాకిచ్చే ట్విస్టుతో అనిమల్ విలన్

మాములుగా సినిమాలో విలన్ అంటే హీరోకు సవాల్ విసురుతూ, మాటల్లో క్రూరత్వాన్ని చూపిస్తూ భయపెట్టాలి. ఆనాటి రావుగోపాలరావు నుంచి ఇప్పటి రావు రమేష్ దాకా ఏ పాత్రని తీర్చిదిద్దినా దర్శకులందరూ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం తన ఆలోచనే వేరని నిరూపిస్తున్నాడు. డిసెంబర్ 1 విడుదల కాబోతున్న అనిమల్ కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చేకొద్దీ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. విలన్ గా నటించిన బాబీ డియోల్ కు ఇందులో ఒక్క డైలాగు ఉండదట. మౌనంగా ఉంటూనే ఒళ్ళు జలదరించే పనులు చేయడం ఇతని స్టైల్.

అసలు మాటలే లేకుండా ఇంత పెద్ద మాఫియా రివెంజ్ డ్రామాలో విలనీ ఎలా పండుతుందనే డౌట్ రావొచ్చు. కానీ సందీప్ తనదైన శైలిలో సమాధానం చెబుతారట. అసలా క్యారెక్టర్ డిజైనే ఊహకందని విధంగా ఉంటుందని, అతను చేసే పనులు చూశాక మూగవాడిగా ఉండటమే నయమనిపించేలా హత్యలు గట్రా ఉంటాయట. యూనిట్ సభ్యులు అనఫీషియల్ గా చెబుతున్న ప్రకారం ఇండియన్ స్క్రీన్ మీద ఇంత ఇంటెన్స్ ఉన్న విలన్ ని చూడటం ఇదే మొదటిసారని ఆడియన్స్ ఫీలవుతారట. ఈ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తున్నారంటే మ్యాటర్ ఏంటో చాలా బలంగా ఉన్నట్టే అనిపిస్తోంది.

రేపు రిలీజ్ అవ్వబోతున్న ట్రైలర్ లో దీనికి సంబంధించిన క్లూస్, డీటెయిల్స్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. రన్బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన అనిమల్ లో అనిల్ కపూర్ తండ్రిగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డిలో విలన్ లేకుండా కేవలం పరిస్థితులనే ప్రతినాయకులుగా మార్చిన సందీప్ వంగా ఇప్పుడు బాబీ డియోల్ రూపంలో ఏ రేంజ్ లో విధ్వంసం చేస్తాడో చూడాలి. తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా భాషల్లో రాబోతున్న అనిమల్ కి అగ్రెసివ్ ప్రమోషన్లు చేయడం లేదు. కంటెంట్ మీద నమ్మకంతో అతి హంగామాకు టి సిరీస్ దూరంగా ఉందని ముంబై టాక్.