బ్లాక్ బస్టర్ ధూమ్ సృష్టికర్త ఇక లేరు

బాలీవుడ్ లో దొంగతనాల బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసే ట్రెండ్ ఒక కొత్త గ్రామర్ నేర్పించిన సిరీస్ గా ధూమ్ కి చాలా ప్రత్యేక స్థానం ఉంది. వరస ఫ్లాపులతో మార్కెట్ తగ్గిపోతున్న తరుణంలో అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ కి బ్లాక్ బస్టర్లు తిరిగి మొదలుపెట్టింది ఇదే. దీని సృష్టికర్త సంజయ్ గద్వి ఇవాళ హఠాత్తుగా గుండెపోటుతో కన్ను మూశారు. ధూమ్ ని స్ఫూర్తిగా తీసుకునే పూరి జగన్నాథ్ నాగార్జునతో సూపర్ తీయడం అభిమానులు మర్చిపోలేరు. స్టైలిష్ మేకింగ్ ఉన్నప్పటికీ ధూమ్ స్థాయిలో నిలవలేకపోయిందన్నది వాస్తవం. ఇంపాక్ట్ అంత బలంగా ఉండేది.

ధూమ్ లో జాన్ అబ్రహంని దొంగా చూపించి మెప్పించిన సంజయ్ ధూమ్ 2లో ఏకంగా హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ లను చోరులుగా మార్చి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ధూమ్ 3 బాధ్యతలు వేరే దర్శకుడికి అప్పజెప్పారు. అందులో అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్ చేసినా మొదటి రెండు భాగాలను మించే స్థాయిలో రూపొందలేదు. దీన్ని బట్టే సంజయ్ టేకింగ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సంజయ్ మొదటి చిత్రం 2001లో వచ్చిన తేరే లియే డిజాస్టర్. ఆ తర్వాత ఆదిత్య చోప్రాతో చేతులు కలపడం కెరీర్ ని మలుపు తిప్పింది. మేరీ యార్ కి షాదీతో తొలి విజయం నమోదు చేసుకున్నాడు.

విచిత్రంగా ధూమ్ తర్వాత సంజయ్ గద్వి చాలా గ్యాప్ తీసుకున్నారు. సంజయ్ దత్ కిడ్నాప్, అర్జున్ రామ్ పాల్ అజబ్ గజబ్ లవ్ ఆశించిన ఫలితాలు అందుకోలేదు. ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకుని 2020లో ఆపరేషన్ పరిందే తీశారు. ప్రశంసలు వచ్చాయి కానీ అంతగా సక్సెస్ కాలేదు. ధూమ్ వచ్చినప్పుడు సంజయ్ గద్వి అగ్ర దర్శకుడిగా ఎదుగుతారనే అంచనాలు బలంగా ఉండేవి. కానీ అది అక్కడికే పరిమితం కావడం విషాదం. త్వరలో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ కి ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో సంజయ్ ఇలా కన్ను మూయడం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.