‘మంగళవారం’పై కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు

ప్రతి ఫిలిం మేకర్ తమ సినిమా సూపర్ అనే అంటాడు. టీంలో పని చేసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి ఆహా ఓహో అనే అంటారు. కానీ ఆ సినిమా ప్రోమోలు చూస్తేనే నిజంగా అందులో కంటెంట్ ఉందా లేదా అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వారం రిలీజ్ కాబోతున్న ‘మంగళవారం’ సినిమాకు సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీని తీసుకురాగలిగాయి. ‘కాంతార’, ‘విరూపాక్ష’ తరహా మిస్టిక్ థ్రిల్లర్ లాగా కనిపిస్తోందీ సినిమా.

కథేంటన్నది ప్రోమోల్లో క్లారిటీ ఇవ్వలేదు కానీ.. సినిమాలో ఏదో నిగూఢంగా ఉంటుందనే సంకేతాలు కనిపించాయి. ఈ సినిమా మీద టీం అంతా సూపర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. టాలీవుడ్లో కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే చర్చ నడుస్తోంది. సినిమా చూసిన వాళ్లందరూ పాయల్ రాజ్‌పుత్ పాత్ర గురించి, సెకండాఫ్‌లో ట్విస్టుల గురించి గొప్పగా చెబుతున్నారు. 

దర్శకుడు అజయ్ భూపతి అయితే ‘మంగళవారం’ మీద మామూలు కాన్ఫిడెన్స్‌లో లేడు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ అవుతుందని ‘మంగళవారం’ గురించి ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కథ మీద నమ్మకంతోనే నిర్మాతలు రూ.20 కోట్ల దాకా ఖర్చు పెట్టారని అతను చెప్పాడు. రిలీజ్‌కు ముందే సినిమాకు టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని కూడా చెబుతున్నాడు. టెక్నికల్‌గా ఒక లెవెల్లో సినిమా ఉంటుందని.. మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉంటాయని.. చివరి 45 నిమిషాల్లో వచ్చే ట్విస్టులతో ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అయిపోతారని చెబుతున్నాడు.

తన రెండో సినిమా ‘మహాసముద్రం’లో ట్విస్టులేమీ లేకుండా ప్లెయిన్‌గా ఒక కథ చెప్పాలని చూశానని.. అది వర్కవుట్ కాలేదని.. దీంతో ఈసారి రూటు మార్చి కొత్త జానర్ ఎంచుకుని ప్రేక్షకులు ఊహించలేని ట్విస్టులతో ఈ సినిమా తీశానని.. సినిమా మామూలుగా ఉండదని.. పెద్ద హిట్టవుతుందని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి నిజంగా దర్శకుడు, టీం చెబుతున్నంత స్థాయిలో ‘మంగళవారం’ ఉంటుందేమో చూడాలి.