కార్తి వెర్స‌స్ సూర్య.. కాదు కాదు

ఈ ఏడాది సౌత్ ఇండియలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన చిత్రం ‘అయ్యప్పనుం కోషీయుం’. పారితోషకాలు తీసేస్తే కేవలం రూ.5 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. లాక్ డౌన్‌కు కొన్ని వారాల ముంగిట విడుదలైన ఈ చిత్రం.. రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇంకా బాగా ఆడుతుండగానే థియేటర్లు మూతపడిపోవడంతో కొంత రెవెన్యూ తగ్గింది. ఐతే ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో వివిధ భాషల వాళ్లు విరగబడి చూశారు.

లాక్ డౌన్‌ టైంలో సౌత్‌లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న చిత్రాల్లో ఇదొకటి. విడుదలైన కొన్ని రోజులకే ఈ చిత్రానికి తెలుగు, తమిళ రీమేక్స్ ఖరారయ్యాయి. తెలుగులో లీడ్ యాక్టర్లు, దర్శకుడి కోసం కొన్ని నెలలుగా వేట సాగుతోంది. అది ఎంతకీ ఒక కొలిక్కి రాలేదు. ఈ ప్రాజెక్టును సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ టేకప్ చేయడం, స్క్రిప్టు రెడీ చేయడం మాత్రం వాస్తవం. అంతకుమించి అధికారిక ప్రకటన ఏదీ లేదు.

ఐతే తమిళ రీమేక్ విషయంలోనూ కొన్ని ప్రచారాలు జరిగాయి. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ పోషించిన పాత్రల్ని తమిళంలో సోదరులైన సూర్య, కార్తి చేయబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ కాంబినేషన్ భలే ఆసక్తిగా అనిపించింది. ఐతే ఇగోతో ఒకరినొకరు దెబ్బ తీసుకుంటూ సాగే పాత్రల్లో అన్నదమ్ములు నటిస్తే బాగుంటుందా అన్న ప్రశ్నలూ తలెత్తాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఈ అన్నదమ్ముల్లో ఒకరే నటించనున్నారట. పృథ్వీరాజ్ పాత్రకు కార్తి మాత్రమే ఖరారయ్యాడట.

బిజు చేసిన పాత్రకు సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీబన్ ఓకే అయినట్లు సమాచారం. బిజు పాత్రకు ఆయన పర్ఫెక్ట్ ఛాయిస్ అని అభిప్రాయపడుతున్నారు. ఓ స్టార్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. మలయాళంలో రైటర్ టర్న్డ్ డైరెక్టర్ సాచి ‘అయ్యప్పనుం కోషీయుం’ను రూపొందించాడు. దీంతో పాటు మరికొన్ని అద్భుత చిత్రాలను అందించిన సాచీ.. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అందించిన కొన్ని నెలలకే, ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం విషాదం.