ఆ భారీ చిత్రం అయిదోసారి వాయిదా

బాలీవుడ్లో గ‌త ద‌శాబ్ద కాలంలో వేగంగా ఎదిగిన హీరోల్లో సిద్దార్థ్ మ‌ల్హోత్రా ఒక‌డు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయ‌ర్, ఏక్ విల‌న్, షేర్షా లాంటి సినిమాలు అత‌డికి చాలా మంచి పేరు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజైన షేర్షా అద్భుత‌మైన స్పంద‌న తెచ్చుకుని సిద్దార్థ్ కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెంచుకున్న సిద్దార్థ్ వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అందులో భాగంగా వ‌చ్చిన మిష‌న్ మ‌జ్ను నిరాశ‌ప‌రిచింది. ఇంకో పెద్ద సినిమా యోధ వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఎంత‌కీ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌ట్లేదు. ఈ సినిమా ఇప్ప‌టికే నాలుగుసార్లు వాయిదా ప‌డ‌టం గ‌మ‌నార్హం.

చివ‌ర‌గా యోధ‌కు ప్ర‌క‌టించిన రిలీజ్ డేట్ డిసెంబ‌రు 8. ఈసారైనా ప‌క్కాగా యోధ రిలీజ‌వుతుందేమో అనుకుంటే.. ఆ డేట్ కూడా మార్చేశారు. ఇంకో మూడు నెల‌ల‌కు పైగా వాయిదా వేసి 2024 మార్చి 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ‌లో క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. అంత పెద్ద బేన‌ర్ తీస్తున్న సినిమా ఇన్నిసార్లు వాయిదా ప‌డ‌టం సిద్దార్థ్ అభిమానుల‌కు రుచించడం లేదు.

సాగ‌ర్ ఆంబ్రే, పుష్క‌ర్ ఓజా సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం.. సిద్దార్థ్ కెరీర్లోనే హైయెస్ట్ బ‌డ్జెట్లో తెర‌కెక్కుతోంది. ఇదొక ఫుల్ లెంగ్త్ యాక్ష‌ణ్ ఎంట‌ర్టైన‌ర్. దేశ విదేశాల్లో చిత్రీక‌రణ జ‌రుపుతున్నారు. ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తున్న రాశి ఖ‌న్నా బాలీవుడ్లో త‌న‌కు యోధ పెద్ద బ్రేక్ ఇస్తుందని ఆశిస్తోంది. దిశా ప‌ఠాని యోధ‌లో మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.