టాలీవుడ్‌కు ‘పొలిమేర’ షాక్

మా ఊరి పొలిమేర.. కరోనా టైంలో హాట్ స్టార్ ఓటీటీ వేదికగా రిలీజైన ఓ చిన్న సినిమా. దానికి థియేట్రికల్ రిలీజ్ లేదు. నేరుగా ఓటీటీలో రిలీజైంది. సత్యం రాజేష్ హీరో అంటే జనం ముందు పెద్దగా పట్టించుకోలేదు. లో ప్రొడక్షన్ వాల్యూస్‌తో చేతబడుల చుట్టూ తిరిగే కథతో తీసిన ఈ సినిమా నెమ్మదిగా జనాల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇందులో సత్యం రాజేష్ పాత్రకు సంబంధించిన ట్విస్టులు బాగా పేలాయి.

కొంచెం బూతులు, హాట్ సీన్లు జోడించి ఓటీటీ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా తీశాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. ఐతే క్రమ క్రమంగా ఆదరణ పెంచుకుని హాట్ స్టార్‌లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది ‘మా ఊరి పొలిమేర’. ఈ స్పందన చూసి దీని సీక్వెల్ మీద కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి, మరింత కసరత్తు చేసి ఇంకొంచెం బలంగా సినిమా తీశారు.

బన్నీ వాసు లాంటి పేరున్న నిర్మాత ఫ్యాన్సీ రేటు పెట్టి ఈ సినిమా హక్కులు కొని రిలీజ్ చేశాడు. పబ్లిసిటీ కూడా బాగానే చేశారు. ‘మా ఊరి పొలిమేర’ చూసి థ్రిల్ అయిన వాళ్లందరూ థియేటర్లకు వచ్చి ‘మా ఊరి పొలిమేర-2’ చూడ్డానికి ఆసక్తి ప్రదర్శించారు. అయినా కూడా చిన్న సినిమా కదా వసూళ్లు ఓ మోస్తరుగానే ఉంటాయనుకున్నారు. కానీ ఈ చిత్రం తొలి రోజు ఏకంగా రూ.3 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది. ఈ సినిమా రేంజికి ఇవి చాలా ఎక్కువ వసూళ్లే. నైజాం వరకే సినిమా కోటిన్నర కలెక్ట్ చేసింది.

తొలి రోజు చాలా చోట్ల సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. సింగిల్ స్క్రీన్లు జనాలతో కళకళలాడాయి. మల్టీప్లెక్సుల్లో కూడా మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నా అది వసూళ్ల మీద ప్రభావం చూపట్లేదు. తొలి రోజు రెస్పాన్స్ చూసి రెండో రోజు ఈ చిత్రానికి థియేటర్లు కూడా పెంచారట. బుక్ మై షో ట్రెండ్స్‌లో ఈ సినిమానే ప్రస్తుతం తెలుగులో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఈ చిన్న సినిమా ఇలాంటి సంచలనం రేపడం టాలీవుడ్‌కు పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు