కార్తి.. సీట్ల కింద బాంబులు పెడతాడట

తెలుగు ప్రేక్షకులతో సూర్య, కార్తి సోదరులది ప్రత్యేక అనుబంధం. వాళ్లిద్దరినీ తమిళ హీరోల్లాగే చూడరు మన ఆడియన్స్. వాళ్ల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే తెలుగులో ఇక్కడి మిడ్ రేంజ్ హీరోల సినిమాల స్థాయిలో వసూళ్లు రాబడతాయి. తెర మీదే కాక బయట కూడా చాలా లవబుల్‌గా అనిపించే ఈ అన్నదమ్ములు.. ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చినా మన ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవుతుంటారు.

ఏదో సినిమా ప్రమోషన్ కోసమని కాకుండా.. నిజంగా ఒక అనుబంధం ఉన్నవాళ్లతో మాట్లాడినట్లుగా అభిమానులతో మాట్లాడుతుంటారు. తన కొత్త చిత్రం ‘జపాన్’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన కార్తి.. ఒక రోజంతా మీడియా ఇంటర్వ్య్యూలతో బిజీగా గడిపి.. శనివారం ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను చేసిన ప్రసంగం.. విసిరిన చమక్కులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

సోషల్ మీడియాలో పాపులర్ మీమ్‌గా మారిన ‘యుగానికి ఒక్కడు’లోని ‘‘ఎవర్రా మీరంతా’’ డైలాగ్‌ను ఉచ్ఛరించి అభిమానుల్లో హుషారు నింపిన కార్తి.. స్పీచ్ చివర్లో పేల్చిన పంచ్ ఇంకా హైలైట్ అయింది. ‘జపాన్’ సినిమాలో కార్తి ఒక వెరైటీ స్టయిల్లో డైలాగులు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ డైలాగ్ డెలివరీని అనుకరిస్తూ.. ‘‘జపాన్ స్టయిల్లో అందరికీ ఒక మాట చెప్తున్నా. నవంబరు 10న సినిమా వస్తుంది. మీరంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడకపోతే సీట్ల కింద బాంబులు పెడతా’’ అంటూ ఒక వెరైటీ మాడ్యులేషన్లో పంచ్ పేల్చాడు కార్తి. దీంతో ఆడిటోరియం ఒక్కసారిగా హోరెత్తింది.

మరోవైపు ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నాని గురించి చాలా గొప్పగా మాట్లాడాడు కార్తి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలుపెట్టి.. తర్వాత నటుడిగా మారి.. అద్భుతమైన పాత్రలతో ఎంత పెద్ద స్థాయి అందుకున్నాడో అంటూ నానిని కొనియాడాడు. జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా లాంటి సినిమాల్లో తన పెర్ఫామెన్స్ గురించి ప్రస్తావించాడు. ఎంతోమంది ప్రతిభావంతులైన కొత్త దర్శకులను పరిచయం చేశాడని పేర్కొంటూ.. ఎవరైనా ఒక కొత్త కథతో సినిమా తీయాలంటే నాని ఇంటి డోర్ ఎప్పుడూ తెరిచే ఉంటుందంటూ అతడిపై ప్రశంసలు కురిపించాడు.