కార్తి.. అంచనాలకు అందడు

తమిళ స్టార్ హీరో సూర్య బాటలో అతడి తమ్ముడు కార్తి హీరో అవుతున్నాడని వార్త బయటికి వచ్చినపుడు.. ఏమంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు కోలీవుడ్లో. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నవాడు సినిమాల్లోకి వస్తున్నాడంటే.. ఏమాత్రం ప్రత్యేకత చూపించగలడో అని సందేహించారు. అన్నతో పోల్చుకుని చూస్తే తేలిపోతాడేమో అనుకున్నారు. కానీ తొలి చిత్రం ‘పరుత్తి వీరన్’తోనే అందరికీ పెద్ద షాకిచ్చాడు కార్తి. ఇక ఆ తర్వాత అతను ఎంచుకున్న కథలు.. పోషించిన పాత్రల గురించి చెప్పడానికి చాలానే ఉంది.

చాలామంది దర్శకులు తమ కెరీర్లలోనే బెస్ట్ మూవీస్ కార్తితోనే తీయడం విశేషం. కార్తిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. అతను పక్కా క్లాస్ మూవీతో మెప్పించగలడు. మాస్ మసాలా చిత్రంతోనూ ఆకట్టుకోగలడు. అతను ఎప్పుడు ఎలాంటి సినిమా చేస్తాడో అంచనా వేయలేం. ఒక సినిమాకు ఇంకో సినిమాకు పొంతన ఉండదు. రకరకాల జానర్లలో, భిన్నమైన కథల్లో నటించి మెప్పించడం తన ప్రత్యేకత.

గత ఏడాది ‘సర్దార్’తో అదరగొట్టిన కార్తి.. ఇప్పుడు ‘జపాన్’ అనే మరో వైవిధ్యమైన సినిమాతో వస్తున్నాడు. సీరియస్‌ రోల్‌లో మెప్పించి.. ఇప్పుడు పూర్తి ఎంటర్టైనింగ్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన కొత్త సినిమాల లైనప్ కూడా చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తోంది. ‘సూదుకవ్వుం’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తి తన కొత్త సినిమా చేస్తున్నాడు. ఇది ‘సూదుకవ్వుం’ తరహాలోనే డార్క్ కామెడీగా తెరకెక్కనుందట.

దీని తర్వాత ‘96’ దర్శకుడితో ఒక క్లాస్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు కార్తి. మరోవైపు అతడి కోసం ఇంట్రెస్టింగ్ సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. లోకేష్ కనకరాజ్ ‘ఖైదీ’ సీక్వెల్‌‌ను 2025లో చేయాలనుకుంటున్నాడు. అంతకంటే ముందు మిత్రన్ ‘సర్దార్’ కొనసాగింపు చిత్రం చేయబోతున్నాడు. ‘జపాన్’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన కార్తి.. మీడియా సంభాషణలో ఈ లైనప్ గురించి చెప్పాడు. చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్న ఈ లైనప్ చూసి కార్తి అంచనాలకు అందడని అంటున్నారు తన అభిమానులు.