భారతీయ గ్రాఫిక్స్ కోరుకున్న ప్రాజెక్ట్ K

టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కె గురించి దర్శకుడు నాగ అశ్విన్ తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశాడు. హైదరాబాద్ లో జరుగుతున్న సినిమాటికా ఎక్స్ పోకి విచ్చేసి తన మనోభావాలను పంచుకున్నాడు. ప్రాజెక్ట్ కె గ్రాఫిక్స్ మేడ్ ఇన్ ఇండియా నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడే మొత్తం చేయించాలనుకున్నామని, అయితే కొన్ని పరిమితుల వల్ల సాధ్యపడక కొంత భాగం విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందట. కానీ తర్వాత చేయబోయే దానికి మాత్రం పూర్తిగా ఇక్కడి వనరులనే వాడుకుంటానని చెప్పాడు.

నాగ అశ్విన్ ఈ సందర్భంగా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయాలే చెప్పుకొచ్చాడు. సాంకేతికంగా మన చదువులు ఎంతో ఉన్నంతగా ఉన్నప్పటికీ వాటి వాడకంలో మాత్రం మనం వెనుకబడే ఉన్నాం. ఈ సమస్య ఇప్పటిది కాదు. రెండు మూడు దశాబ్దాల క్రితమే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అమ్మోరు, అంజి, అరుంధతి విజువల్ ఎఫెక్ట్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టి ఫారిన్ బృందాలతో పని చేయించుకోవాల్సి వచ్చింది. శంకర్ కు సైతం రోబో విషయంలో ఈ ఇబ్బందులు తప్పలేదు. క్వాలిటీ స్టూడియోలతో పాటు సరైన నిపుణులు అందుబాటులో లేకపోవడం సమస్య తీవ్రతని సూచిస్తోంది.

రాబోయే రోజుల్లో ఈ విభాగంలో మనం బలపడాల్సింది చాలా ఉంది. రాజమౌళి లాంటి మేకర్స్ ని ఎక్కడికి వెళ్లే అవసరం రానివ్వకుండా చేయాలి. సాఫ్ట్ వేర్ తెలివితేటలు సినిమా రంగానికి ఉపయోగపడాలి. ప్రాజెక్ట్ కె టీజర్ వచ్చినప్పుడు గ్రాఫిక్స్ పరంగా కొంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ వినిపించిన మాట వాస్తవం. నాగ అశ్విన్ ఆ అభిప్రాయాలను సీరియస్ గా తీసుకుని కావాల్సిన మార్పులు చేర్పులు చేస్తానని ఆ టైంలోనే ప్రకటించాడు. ఇంతకీ ప్రాజెక్ట్ కె విడుదల తేదీ ఎప్పుడనేది మాత్రం ఇంకా తేలలేదు. 2024 వేసవి లేదా దీపావళి దసరా ఈ మూడింటిలో ఒక ఆప్షన్ ని ఎంచుకోవచ్చని వైజయంతి వర్గాల టాక్.