పోలీసులతో ఆడుకునే దొంగ ‘జపాన్’

యుగానికి ఒక్కడు, నా పేరు శివ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు స్ట్రెయిట్ మూవీ ఊపిరితో ప్రేక్షకులకు మరింత దగ్గరైన కార్తీ కొత్త చిత్రం జపాన్ వచ్చే నెల దీపావళి కానుకగా నవంబర్ రెండో వారంలో విడుదల కానుంది. ఇది కార్తీకి పాతికవ సినిమా. ఈ సందర్భంగా చెన్నైలో సూర్య ముఖ్యఅతిధిగా తనతో పని చేసిన నిర్మాతలు, దర్శకులందరినీ పిలిచి ఈవెంట్ చేశారు. కోలీవుడ్ సెలబ్రిటీలు చాలానే హాజరయ్యారు. ప్రత్యేకంగా రాత్రి 10 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసి జపాన్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ హక్కులు కొనడంతో మంచి ప్రమోషన్ తో థియేటర్లలో అడుగు పెట్టనుంది.

సముద్రపు ఒడిలో పుట్టిపెరిగిన జపాన్(కార్తీ) పదేళ్ల వయసు నుంచే దొంగతనాలు మొదలుపెడతాడు. ముందు చిల్లరతో మొదలై తర్వాత లక్షలకు చేరుకుంటుంది. ఓసారి ఏకంగా మినిస్టర్(కెఎస్ రవికుమార్)కు చెందిన బంగారు కొట్టుని లూటీ చేసి రెండు వందల కోట్ల సొత్తు దోచుకు పోతాడు. దీంతో జపాన్ ని పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు స్పెషల్ ఆఫీసర్(సునీల్). కేరళలో దాక్కున్నాడని తెలుసుకుని వేట మొదలుపెడతాడు. అయితే ప్రియురాలి(అను ఇమ్మానియేల్)తో అజ్ఞాతంలోకి చెక్కేసిన జపాన్ చివరికి ఏమయ్యాడు, పోలీసులకు దొరికాడా లేదానేది తెరమీద చూడాలి.

ఒక డిఫరెంట్ స్లాంగ్ తో కార్తీ స్వంతంగా చెప్పిన తెలుగు డబ్బింగ్ తో మొదలుపెట్టి క్యారెక్టరైజేషన్ వరకు అన్ని వెరైటీగా ఉన్నాయి. ఒక దొంగ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కం  ఛేజింగ్ స్టోరీగా తీర్చిదిద్దాడు దర్శకుడు రాజు మురుగన్. జివి ప్రకాష్ నేపధ్య సంగీతం విభిన్నంగా ఉంది. విజువల్స్ గట్రా చూస్తుంటే కార్తీ మరో డిఫరెంట్ అటెంప్ట్ చేసినట్టే అనిపిస్తోంది. మార్క్ ఆంటోనీ, మహావీరుడు, జైలర్ తర్వాత సునీల్ కి తమిళంలో మరో ప్రాధాన్యత కలిగిన పాత్ర దక్కింది. రిలీజ్ డేట్ ట్రైలర్ లో ప్రస్తావించలేదు కానీ పదో తేదని చెన్నై టాక్. గట్టిపోటీ మధ్యే వస్తున్న కార్తీకి సల్మాన్ ఖాన్, వైష్ణవ్ తేజ్, లారెన్స్ లు స్వాగతం చెప్పబోతున్నారు