డుంకీకి దిల్ రాజు అభయ హస్తం ?

ప్రభాస్ సలార్ ని ఎదురుకోవడం గురించి మల్లగుల్లాలు పడుతున్న షారుఖ్ ఖాన్ డుంకీకి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇబ్బందులు తలెత్తున్నాయి. థియేటర్ల సమస్య అందులో ప్రధానమైంది. డార్లింగ్ మాస్ ని చూసేందుకే మన జనాలు ఇష్టపడతారు కానీ రాజ్ కుమార్ హిరానీ క్లాస్ కోసం ఎగబడరు. కింగ్ ఖాన్ సోలోగా వస్తే అది వేరే సంగతి. పఠాన్, జవాన్ లకు ఈ అంశం బ్రహ్మాండంగా కలిసి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు దక్కాయి. అదే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరైనా ఎదురుగా ఉంటే ఖచ్చితంగా లెక్కల్లో తేడా వచ్చేవి. అవన్నీ చెక్ చేసుకునే పక్కా ప్లాన్ తో వాటిని రిలీజ్ చేశారు.

కానీ డుంకీకి ఆ అవకాశం లేదు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డుంకీ నైజామ్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకుంటారట. సలార్ ని మైత్రి పంపిణి చేస్తోంది. సో థియేటర్ల పరంగా నువ్వా నేనాని తలపడాలంటే ఒక పెద్ద చెయ్యి అండ షారుఖ్ బృందానికి అవసరం. అది దిల్ రాజు రూపంలో దొరికిందని ముంబై టాక్. ఎంత మొత్తం, ఏ పద్దతిలో అగ్రిమెంట్ జరిగిందనే వార్తలు ఇంకా బయటికి రాలేదు కానీ భారీ మొత్తమే ఉంటుంది. అఫీషియల్ అయితే తప్ప ఫిగర్లు రివీల్ కావు. ఇదే నిజమే అయితే సలార్, డుంకీల స్క్రీన్ల పంపకాలు పెద్ద చర్చకే దారి తీయడం ఖాయం.

ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ థియేటర్ల కేటాయింపు, అగ్రిమెంట్లు ఆల్రెడీ మొదలైపోయాయి. చివరి నిమిషంలో హడావిడి పడేవి కాదు కాబట్టి ముందస్తుగానే అన్నీ చూసుకోవాలి. డుంకీ ఒకరోజు ముందు డిసెంబర్ 21నే రావడం వల్ల ఓపెనింగ్స్ పరంగా చాలా ప్లస్ కానుంది. అయితే సలార్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే దాని వల్ల షారుఖ్ కి ఇబ్బందులు తప్పవు. కంటెంట్ పరంగా రెండు సంబంధం లేని జానర్లు కావడం వల్ల ప్రేక్షకులూ రెండు చూడొచ్చు కానీ బాక్సాఫీస్ డైనోసర్ ని ఎదురుకోవడం బాద్షాకు అంత సులభంగా ఉండదనేది మాత్రం వాస్తవం. పోటాపోటీ ఎత్తుగడలు చాలానే రాబోతున్నాయి.