భగవంత్ కేసరి.. సీక్వెల్ తీసే ధైర్యం లేదు

ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండు నడుస్తోంది. హిట్ అయిన ప్రతి సినిమాకూ సీక్వెల్, లేదా సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసేస్తున్నారు. ఈ దిశగా సినిమాల చివర్లో హింట్ కూడా ఇస్తున్నారు. ఐతే చాలా వరకు ఈ సినిమాలు ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి. తర్వాత సీక్వెల్, సెకండ్ పార్ట్ ఊసే ఎత్తట్లేదు ఎవ్వరూ. టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘భగవంత్ కేసరి’కి సీక్వెల్ ఉంటుందా అనే ఒక చర్చ నడుస్తుండగా.. అనిల్ రావిపూడి అది కష్టమే అన్నట్లు మాట్లాడాడు.

‘భగవంత్ కేసరి’ సక్సెస్ సెలబ్రేషన్లలో అనిల‌్‌కు ఈ సినిమా సీక్వెల్ మీద ప్రశ్న ఎదురైంది. దానికి అతను బదులిస్తూ.. ‘‘భగవంత్ కేసరికి సీక్వెల్ తీసేంత ధైర్యం నాకు లేదు. ఇప్పటికే నేను మోయలేనంత భారం మోసి అలసిపోయాను. ఒకవేళ సీక్వెల్ తీసేంత ధైర్యం, దమ్ము నాకు బాలకృష్ణ గారు ఇస్తే.. సీక్వెల్ గురించి ఆలోచిస్తా’’ అని చెప్పాడు.

ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అగ్ర నిర్మాత దిల్ రాజు ‘భగవంత్ కేసరి’ చాలా రోజుల పాటు ఆడే సినిమా అన్నారు. అనిల్ రావిపూడి చివరి అయిదు సినిమాలూ తన బేనర్లోనే చేశాడని.. ‘భగవంత్ కేసరి’ కథను తాను ఎప్పుడో విన్నానని ఆయన వెల్లడించారు. ‘‘ఈ కథ నాకు ఎప్పుడో చెప్పాడు అనిల్. తెలంగాణ మాండలికంలో బాలయ్య గారు డైలాగ్స్ చెబితే చాలా కొత్తగా ఉంటుందని చెప్పా.

ముందు ఈ సినిమాకు ‘బ్రో.. ఐ డోంట్ కేర్’ అనే టైటిలే అనుకున్నాడు అనిల్. చివరికి ‘భగవంత్ కేసరి’గా మార్చాడు. ‘భగవంత్ కేసరి’ సినిమా ఫ్యామిలీస్‌, లేడీస్‌కి బాగా కనెక్టయింది. ఈ రోజు నాకు తెలిసిన డాక్టర్లు ఇద్దరు ఈ సినిమా చూసి భలే ఉందని చెప్పారు. ఫ్యామిలీస్‌కి కనెక్ట్ అయిన సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది. ఈ సినిమాను చాలా రోజుల పాటు ప్రమోట్ చేస్తూనే ఉండాలి. ఇది లాంగ్ రన్ ఫిల్మ్’’ అని దిల్ రాజు అభిప్రాయపడ్డాడు.