ప్రభాస్ – నిజమైన బాక్సాఫీస్ డైనోసర్  

స్టార్ హీరో వారసత్వం ముళ్లబాట లాంటిది. ఆస్తులను అనుభవించడం, పెంచడం సులభమే కానీ అభిమానుల అంచనాలను నిలబెట్టుకుంటూ మార్కెట్ ని పెద్ద స్థాయికి తీసుకెళ్లడం మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. 2002లో ఈశ్వర్ తో తెరంగేట్రం చేసే నాటికి ప్రభాస్ రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారి తమ్ముడి కొడుకుగా మాత్రమే ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కుర్రాడిలో విషయం ఉందనే సంకేతం జనాలకు ఇచ్చాడు. రెండో సినిమా రాఘవేంద్ర డిజాస్టరైనా కథల ఎంపికలో తీసుకున్న జాగ్రత్త, కొత్త దర్శకుడిని నమ్మి చేసిన వర్షం మొదటి బ్లాక్ బస్టర్ ని నమోదు చేసింది.

అడవి రాముడు, చక్రంలు నిరాశపరిచినా రాజమౌళితో మొదటిసారి జట్టు కట్టిన ఛత్రపతి తనలోని రియల్ ఫైర్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రభాస్ లోని నటుడిని బాగా సానబెట్టాయి. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఘన విజయాలు తనలోని లవ్ బాయ్ ని యువతకు దగ్గర చేశాయి. ఓవర్ మాస్ తో రెబెల్ దెబ్బేసినా మిర్చితో తిరిగి తన సత్తా చాటాడు. ఇక బాహుబలి రెండు భాగాలూ ఇండియా దాటి ప్రభాస్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి తిరుగు లేని ప్యాన్ ఇండియా సింహాసనం మీద కూర్చోబెట్టాయి.

సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ లు ఫ్లాప్ అయ్యుండొచ్చు. కానీ వాటి ప్రభావం కించిత్ కూడా లేనంత ఎత్తులో ప్రభాస్ ఉన్నాడు. అందుకే సలార్ గురించి జ్వరం వచ్చినట్టు ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో కల్కి 2898 ఏడి రూపొందుతోంది. దర్శకుడు మారుతీ సినిమాని డైరెక్టర్ బ్రాండ్ తో సంబంధం లేకుండా ఎగబడి కొంటున్నారు. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ షూటింగ్ మొదలుకాకుండానే ప్రకంపనలు రేపుతోంది. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ కేవలం స్టార్ కాదు సలార్ టీజర్ లో టినూ ఆనంద్ చెప్పినట్టుగా టాలీవుడ్ బాక్సాఫీస్ డైనోసర్ అంటే కాదనేదెవరు.