ఆదిత్య 999 కథ రాసుకున్నా – బాలయ్య

ముప్పై మూడేళ్ళ క్రితం వచ్చిన టాలీవుడ్ మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369కి కొనసాగింపు కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దర్శకులు సింగీతం శ్రీనివాసరావు పలుమార్లు ఈ ప్రతిపాదన పరిశీలించినప్పటికీ వయసు రిత్యా ఆయన చేసే పరిస్థితిలో లేకపోవడంతో ఆ బాధ్యతను బాలకృష్ణ స్వయంగా తీసుకోబోతున్నారు. గతంలో ఈ విషయంలో చూచాయగా చెప్పారు కూడా. మోక్షజ్ఞని పరిచయం చేయడానికి దీన్ని వాడుకున్నా ఆశ్చర్యం లేదని వివరించారు. తాజాగా భగవంత్ కేసరి ప్రమోషన్లలో భాగంగా శ్రీలీల చేసిన ఇంటర్వ్యూలో మరింత క్లారిటీ ఇచ్చారు.

ఆదిత్య 999 కథ సిద్ధంగా ఉంది. ఒక రోజు రాత్రి ఆలోచన వచ్చి అలాగే పడుకుండి పోయి ఉదయం లేవగానే మంచి కాన్సెప్ట్ తట్టి దాన్ని అల్లుకుంటూ పోతే స్టోరీ రెడీ అయిపోయిందట. ఏదీ అతిగా ప్రీ ప్లాన్ చేసుకోనని, అప్పటికప్పుడు అనిపించేవి అమలు చేయడమే తన సక్సెసని చెప్పిన బాలయ్య ఆదిత్య 999 తన దర్శకత్వానికి డెబ్యూ లేదా రెండో సినిమా కావొచ్చనే హింట్ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞని లాంచ్ చేయొచ్చని స్పష్టం చేశారు. సో నందమూరి అభిమానుల అతి పెద్ద మూడు కోరికలు ఒకేసారి 2024లో తీరబోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఒకటి బాలయ్య దర్శకత్వం. రెండోది మోక్షజ్ఞ తెరంగేట్రం. మూడోది ఆదిత్య 369 కంటిన్యుయేషన్. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో మంచి ఊపుమీదున్న బాలకృష్ణ త్వరలో బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్ సినిమాలో అడుగు పెట్టబోతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతారని ఇన్ సైడ్ టాక్. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు రాబోతున్న దృష్ట్యా టిడిపి తరఫున బాలయ్య ప్రచారం చాలా కీలకం కానుంది. పూజా కార్యక్రమాలు జరిపినప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఏప్రిల్ లో కొనసాగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.