సలార్ నైజామ్ బిజినెస్ చాలా హాటు గురూ

సరిగ్గా ఇంకో అరవై రోజుల్లో సలార్ దర్శనం జరగబోతోంది. వరసగా మూడు డిజాస్టర్లు సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ ల తర్వాత వస్తున్న సినిమా అయినా మార్కెట్ పరంగా ఎలాంటి ప్రభావం లేకుండా ప్రభాస్ నిజంగానే డైనోసర్ లా అరాచకం చేసేందుకు రెడీ అవుతున్నాడు. నైజామ్ హక్కులను సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ పద్ధతి మీద ఒక్క నైజామే 65 కోట్లకు కొన్నట్టు వచ్చిన వార్త ట్రేడ్ వర్గాల్లో సెగలు రేపుతోంది. రాజమౌళి ఆస్కార్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ దీనికన్నా జస్ట్ 5 కోట్లు ఎక్కువగా గత ఏడాది అమ్ముడుపోవడం గమనించాల్సిన విషయం.

ఇక టికెట్ రేట్లు, షో టైమింగ్స్ గురించి బయ్యర్లలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి అనుమతులు గట్రా ఇవ్వలేరు కానీ ఫలితాలు వచ్చిన వెంటనే అప్లై చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సలార్ షోలు కనీసం రోజుకు ఆరు చొప్పున ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. టికెట్ రేట్లకు సంబంధించి కనీసం డెబ్భై నుంచి వంద రూపాయల హైక్ ఉండేలా అడగబోతున్నారు. అదే జరిగితే మల్టీప్లెక్సుల్లో 400 రూపాయలు దాకా చేరుతుంది. సింగల్ స్క్రీన్లలో 230  దాటేస్తుంది. వీటికి మళ్ళీ జిఎస్టి అదనంగా కలుపుకోవాలి.

ఏపీలో అనుమతులు ఎలా ఉంటాయో ఇప్పుడే ఊహించుకోవడం కష్టం. పర్మిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వినడానికి రెండు నెలల సమయం పెద్దగా అనిపిస్తున్నా రోజులు పరిగెత్తుతాయి కాబట్టి ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఒత్తిడిని ఎదురుకుంటూనే మరోవైపు బిజినెస్ లావాదేవీలు పూర్తి చేస్తున్నారు. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హోంబాలే ఫిలిమ్స్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందోననే ఉత్సుకతతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ కాగా జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ విలన్లుగా నటిస్తున్నారు.