విశాల్ పోరాటం.. సెన్సార్ కష్టం తీరినట్లే

తమిళ హీరో, నిర్మాత విశాల్.. గత ముంబయి సెన్సార్ బోర్డులో అవినీతిపై చేసిన ఆరోపణలు.. అతను రిలీజ్ చేసిన వీడియో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ సెన్సార్ చేయించేందుకు రూ.6.5 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను వెల్లడించాడు. స్క్రీనింగ్‌కు రూ.3 లక్షలు, సెన్సార్ సర్టిఫికేషన్‌కు రూ.3.5 లక్షలు ఇచ్చానంటూ ఎవరెవరికి డబ్బులు పంపింది అకౌంట్ వివరాలతో సహా అతను సోషల్ మీడియాలో పెట్టేశాడు.

ఈ వ్యవహారం ఫిలిం ఇండస్ట్రీలో దుమారం రేపింది. సెన్సార్ బోర్డులో అవినీతి గురించి వివిధ ఇండస్ట్రీల్లో  పెద్ద చర్చ జరిగింది. సోషల్ మీడియాలో కూడా దీని మీద డిస్కషన్లు నడిచాయి. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించగా.. కేంద్ర సెన్సార్ బోర్డు కూడా సమీక్షలు నిర్వహించి కొన్ని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా ఇతర భాషల నుంచి హిందీలోకి అనువాదం అయ్యే చిత్రాలను.. ఆయా భాషల కేంద్ర స్థానాల నుంచే సెన్సార్ చేయించే ఆలోచన చేస్తోంది కేంద్ర సెన్సార్ బోర్డు. దీని ప్రకారం తెలుగు నుంచి ఒక సినిమా హిందీలోకి డబ్ చేస్తున్నట్లయితే.. హిందీ వెర్షన్ స్క్రీనింగ్ కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసి అక్కడే సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తారన్నమాట.

సమస్య ఎదురైంది తమిళ సినిమాకు కాబట్టి ముందుగా తమిళం నుంచి హిందీలోకి వచ్చే సినిమాల కోసం చెన్నైలో స్థానికంగా ఒక స్పెషల్ సెన్సార్ టీంను పెడుతున్నారట. ట్రయల్ పద్ధతిలో ఆరు నెలల పాటు చెన్నైలో ఈ బోర్డు ఏర్పాటు కానుంది. అది విజయవంతం అయితే పూర్తి స్థాయిలో హిందీ డబ్బింగ్ సినిమాల కోసం అక్కడ బోర్డు ఏర్పాటవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా లోకల్ డబ్బింగ్ సెన్సార్ బోర్డులు పెడతారు. దీని వల్ల ఇక హిందీ డబ్బింగ్ వెర్షన్ల కోసం ముంబయికి వెళ్లి లాబీయింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.