డైరెక్టర్ ఒక్క నిమిషం పాత్ర.. అదీ స్టోరీ

‘లియో’ సినిమాలో బోలెడంతమంది పెద్ద నటీనటులు ఉన్నారు. కానీ హీరో సహా ఎవ్వరికీ సరైన పాత్రను డిజైన్ చేయలేకపోయాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. సంజయ్ దత్, అర్జున్ లాంటి పెద్ద నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారంటే ప్రేక్షకులు ఎంతో ఊహించుకున్నారు. కానీ ఆ పాత్రలన్నింటినీ తేల్చిపడేశాడు. ఇక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను కేవలం ఒక్క నిమిషం కనిపించే పాత్రకు ఎందుకు తీసుకున్నాడో అసలు అర్థం కాలేదు.

ఇలా కాలిస్తే అలా చచ్చిపోయే అది. కనీసం ఒక్క డైలాగ్ కూడా లేదు. ఆ మాత్రం దానికి ఏ జూనియర్ ఆర్టిస్టునో పెట్టుకోకుండా.. అనురాగ్‌తో ఎందుకు ఆ సీన్ చేయించారో ప్రేక్షకులకు అంతుబట్టలేదు. దీని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. ఐతే అనురాగ్‌తోనే ఆ పాత్ర చేయించడం వెనుక వేరే కథ ఉందట.

గతంలో అనురాగ్ కశ్యప్ ‘ఇమైక్క నోడిగల్’ అనే సినిమాలో సైకో విలన్ పాత్ర చేశాడు. నయనతార లీడ్ రోల్ చేసిన ఆ సినిమా పెద్ద హిట్టయింది. తమిళ సినిమాల పట్ల ముందు నుంచి అనురాగ్‌కు ఆసక్తి ఉంది. అతడికి లోకేష్ కనకరాజ్ సినిమాలు తెగ నచ్చేశాయట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లోకేష్ సినిమాలో చచ్చిపోయే సీన్ ఒకటి చేయాలని ఉందని యథాలాపంగా చెప్పాడట.

ఈ ఇంటర్వ్యూ చూసిన లోకేష్.. అనురాగ్‌కు ఫోన్ చేసి మీరు సరదాకి ఆ మాట అన్నారా అని అడిగితే.. నిజంగానే తనకు అలా ఒక సీన్ చేయాలని ఉందని చెప్పాడట అనురాగ్. దీంతో ‘లియో’ సినిమాలో ఒక పాత్ర చచ్చిపోయే చిన్న సీన్ ఉంటే.. దాన్ని అనురాగ్‌తో చేయించాడట. తాను ఒక పూట ముంబయి నుంచి చెన్నైకి వస్తే.. మూడు గంటల్లో ఆ సీన్ పూర్తి చేసి తనను తిరిగి ఫ్లైట్ ఎక్కించేశారని అనురాగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అనురాగే ఏరి కోరి ఈ చిన్న సీన్ చేశాడు కాబట్టి అతడి పాత్ర అలా ఉండటం గురించి ఎవ్వరూ ఫీలవ్వాల్సిన పని లేదు.