దర్శకుడి మార్పుతో మళ్ళీ ‘బేబీ’ కాంబో

ఊహించని విధంగా అంచనాలకు మించి 2023 బ్లాక్ బస్టర్స్ లో చోటు సంపాదించుకున్న బేబీ సినిమా టీమ్ మరోసారి చేతులు కలిపింది. హీరో హీరోయిన్ కూడా రిపీట్ అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలతో ఈ కలయిక మరోసారి సాధ్యపడుతోంది. అయితే దర్శకుడు మారడం బిగ్ ఛేంజ్. ఆ బాధ్యతను రవి నంబూరికి అప్పగించారు. సంగీతం విజయ్ బుల్గానిన్ అందిస్తుండగా నిర్మాత ఎస్కెఎన్ తో పాటు మరో ముగ్గురు భాగస్వాములు ఉండబోతున్నారు. డైరెక్టర్ కి ఇది డెబ్యూ మూవీ కావడం గమనించాల్సిన విషయం.

బేబీ జోడి రిపీట్ అంటే సహజంగానే బజ్ వచ్చేస్తుంది. ముఖ్యంగా యూత్ లో క్రేజ్ మాములుగా ఉండదు. బేబీ సుమారు వంద కోట్ల దాకా గ్రాస్ సాధించిన విషయం తెలిసిందే. దర్శకుడు సాయి రాజేష్ కి తొలి విజయమే గ్రాండ్ గా దక్కింది. అయితే రెండో సినిమాని డైరెక్ట్ చేయడానికి ముందు తను రాసిన కథనే ప్రొడ్యూసర్లలో ఒకడిగా మారి ప్రాజెక్టుని డిజైన్ చేయడం విశేషం. అయితే ఇది బేబీ లాగా లవ్ ఫెయిల్యూర్, బాధతో ఉండదని ఇన్ సైడ్ టాక్. సముద్రపు ఒడ్డున వైష్ణవికి ఆనంద్ లవ్ ప్రపోజ్ చేస్తూ దగ్గర తీసుకునే సీన్ నే ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేసి లవ్ స్టోరీ అనే హింట్ ఇచ్చారు.

మొత్తం నాలుగు సినిమాలను ఎస్కెఎన్ ప్లాన్ చేసుకోగా వాటిలో ఇది మొదటిది. మరో మూడు అనౌన్స్ మెంట్స్ త్వరలో రాబోతున్నాయి. కంటెంట్ ఉంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ ఋజువు చేసింది. అంతకు ముందు సాయిరాజేష్ రచన చేసిన కలర్ ఫోటో జాతీయ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. బరువైన ఎమోషన్లతో ప్రేమకథలను సున్నితంగా ఆవిష్కరిస్తారని పేరు తెచ్చుకున్న ఈ బృందం నుంచి మరో ఎమోషనల్ మూవీ ఆశించవచ్చు. 2024 వేసవి విడుదలని ప్రకటించేశారు. సో మొత్తం పక్కా ప్రణాళికతోనే షూటింగ్ గట్రా పూర్తి చేయబోతున్నారు.