కేజీఎఫ్’లో ఓకే.. ‘టైగర్’లో నాట్ ఓకే

హీరోయిజం ప్రధానంగా.. ఓవర్ ద టాప్ స్టయిల్లో సాగే కమర్షియల్ సినిమాల్లో ఏం చేసినా చెల్లిపోతుంది. అతి సామాన్యుడైన హీరో.. సీఎంనో, పీఎంనో ఢీకొట్టినా కూడా ప్రేక్షకులు ఓకే అంటారు. లాజిక్కుల గురించి పెద్దగా ఆలోచించరు. అందుకే ‘కేజీఎఫ్’ సినిమాలో హీరో వెళ్లి పార్లమెంటులో మంత్రిని చంపినా.. ప్రధాన మంత్రికి వార్నింగ్ ఇచ్చినా కూడా చెల్లిపోయింది. దాన్ని ఎలివేషన్ లాగా చూశారే తప్ప.. ఒక గ్యాంగ్‌స్టర్ అలా పార్లమెంటులోకి వెళ్లి మంత్రిని చంపడమేంటి.. ప్రధానికే వార్నింగ్ ఇవ్వడమేంటి అనుకోలేదు.

ఈ సినిమా శైలి ఏంటన్నది మొదట్నుంచే అర్థమైపోతుంది కాబట్టి.. అక్కడ లాజిక్కుల గురించి జనం పట్టించుకోరు. కానీ వాస్తవ ఘటనల ఆధారంగా నడిచే సినిమాలు మాత్రం కచ్చితంగా లాజిక్‌కు లోబడే నడవాల్సి ఉంటుంది. నిజ జీవిత సంఘటలనకు కొంచెం మసాలా అద్దితే.. ఎగ్జాజరేట్ చేస్తే ఓకే కానీ లేని విషయాలను చూపించి ఎలివేషన్ ఇవ్వాలనుకుంటే ప్రేక్షకుల ఫీలింగ్ వేరుగా ఉంటుంది.

‘టైగర్ నాగేశ్వరరావు’ చూసిన ప్రేక్షకులకు ఇదే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడే ఓ విషయం ఆశ్చర్యం కలిగించింది. టైగర్ నాగేశ్వరరావుకు భయపడి ప్రధాన మంత్రి సెక్యూరిటీ అలర్ట్ అయినట్లు అందులో చూపించారు. టైగర్ నాగేశ్వరరావు అంటే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక దొంగ. అతను కొన్ని భారీ దోపిడీలే చేశాడు కానీ.. అతడి పరిధి అంతా ఆంధ్రా, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు పరిమితం. అదేమీ జాతీయ సమస్య కాదు.

అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాందీ జోక్యం చేసుకుని.. తన సెక్యూరిటీని రంగంలోకి దించేంత సీన్ టైగర్‌ నాగేశ్వరరావుకు లేదు. కానీ సినిమాలో మాత్రం నాగేశ్వరరావుకు ఎలివేషన్ ఇవ్వడానికి ఇలాంటి సీన్లే పెట్టారు. అతను పీఎం సెక్యూరిటీనే బోల్తా కొట్టించి ప్రధాని ఇంట్లో దొంగతనం చేసినట్లు.. పీఎం సెక్యూరిటీ అధికారి తన గురించి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు.. ఇంకా టైగర్ గొప్పదనం తెలుసుకుని పీఎం ఇందిరాగాంధీ అతణ్ని కొనియాడినట్లు.. ఇలా క్రియేటివిటీని పూర్తిగా హద్దులు దాటించేశారు. దీంతో మరీ ఇంత ఎగ్జాజరేషనా అని, ఇదెలా వాస్తవ కథ అవుతుంది అని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.