ట్యాక్సీవాలా కలయిక మరోసారి

విజయ్ దేవరకొండ కెరీర్ లో విడుదలకు ముందే పైరసీ కోరల్లో నలిగిన సినిమాల్లో ట్యాక్సీ వాలా ఒకటి. రీ రికార్డింగ్ జరగక ముందే వచ్చిన కాపీ ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టడం అప్పట్లో సంచలనం రేపింది. అయినా సరే మంచి విజయం సాధించి నిర్మాతను గట్టెక్కించింది. హారర్ టచ్ తో డెబ్యూ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ థ్రిల్లర్ ని తీర్చిదిద్దిన తీరు ఏకంగా నానితో శ్యామ్ సింగ రాయ్ లాంటి భారీ బడ్జెట్ మూవీ వచ్చేలా చేసింది. అది కూడా విజయం సాధించడంతో ఈ టాలెంట్ ఫిలిం మేకర్ తో చేతులు కలిపేందుకు నిర్మాతలు ఉత్సాహం చూపించారు. ఫైనల్ గా ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని సమాచారం.

ట్యాక్సీ వాలా కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేస్తూ విజయ్ దేవరకొండ-రాహుల్ సంకృత్యాన్ కలయికలో మైత్రి మూవీ మేకర్స్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుందని సమాచారం. ఒక సీరియస్ ఇష్యూ మీద ఆడియన్స్ షాక్ అయ్యేలా స్టోరీ లైన్ ఉంటుందని వినికిడి. మైత్రి సంస్థ విజయ్ తో డియర్ కామ్రేడ్ టైంలో మొత్తం మూడు సినిమాల ఒప్పందం చేసుకుంది. దాని తర్వాత ఇటీవలే ఖుషి వచ్చింది. ఈ రెండు కమర్షియల్ గా నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ ఇవ్వలేకపోయాయి. పేరైతే వచ్చింది కానీ లాభాలు లేవు.

మూడోది మిస్ ఫైర్ కాకుండా పక్కా ప్రణాళికతో రూపొందిస్తున్నట్టు తెలిసింది. రాహుల్ సంకృత్యాన్ ప్రతి స్క్రిప్ట్ కు కనీసం రెండేళ్ల సమయం తీసుకుంటాడు. దీనికి అంతే టైం వెచ్చించాడు. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రావొచ్చు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి సెట్స్ లో అడుగు పెడతాడు. ఈలోగా రాహుల్ ఫైనల్ వెర్షన్ లాక్ చేసుకుని 2024 వేసవి నుంచి షూటింగ్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. మైత్రికి ముచ్చటగా మూడోసారి అయినా రౌడీ హీరోకు హిట్టు పడాలి.