పెద్దోడు వెర్సస్ చిన్నోడు.. వెంకీ ఏమన్నాడంటే?

వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ ఎలా ఉండబోతోందో అంచనా కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. అత్యంత క్రేజీ సీజన్ అయిన సంక్రాంతి కోసం చాలా సినిమాలు రేసులో ఉన్నాయి ఇప్పటికే. ఎవరికి వాళ్లు సంక్రాంతి రిలీజ్ పక్కా అనే అంటున్నారు. కానీ మూడుకు మించి సినిమాలను రిలీజ్ చేస్తే థియేటర్ల సర్దుబాటు చాలా కష్టం అయ్యేలా ఉంది. అన్నింట్లోకి క్రేజ్ ఉన్న సినిమా ‘గుంటూరు కారం’యే. అది చాలా ముందే సంక్రాంతికి ఫిక్స్ అయింది.

తర్వాత హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగా, ఫ్యామిలీ స్టార్.. ఇలా ఒక్కో సినిమా సంక్రాంతి రేసులోకి వస్తూనే ఉంది. వీటిలో ఎన్ని చివరికి రేసులో నిలుస్తాయో తెలియదు. ‘గుంటూరు కారం’ సంక్రాంతికి పక్కా అని ఇటీవలే నిర్మాత నాగవంశీ తేల్చి చెప్పాడు. ఇక ఈ రోజే టీజర్‌తో పలకరించిన ‘సైంధవ్’ టీం కూడా సంక్రాంతికి కచ్చితంగా వస్తామంటూ జనవరి 13వ తేదీని రిలీజ్ డేట్‌గా నొక్కి వక్కాణించింది.

ఐతే మహేష్, వెంకటేష్ గతంలో కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సంక్రాంతికే రిలీజై మంచి విజయాన్నందుకుంది. ఈ ఇద్దరికీ వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. మరి ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర తలపడితే ఎలా ఉంటుందన్న ఆసక్తి నేపథ్యంలో వెంకీని.. ప్రశ్న అడిగారు విలేకరులు. దానికి వెంకీ బదులిస్తూ.. ‘‘పెద్దోడొస్తే సూపర్ హిట్. చిన్నోడొస్తే సూపర్ హిట్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వస్తే చూడలేదా? ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. పెద్దోడికి వెయిట్ చేస్తారు.

చిన్నోడికి వెయిట్ చేస్తారు. నిజానికి చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరి సినిమాలు ఒకేసారి వస్తున్నాయంటే. ప్రేక్షకులు మా ఇద్దరి సినిమాలను ఎలా ఆదరిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని వెంకీ అన్నాడు. ఇక ‘సైంధవ్’ సినిమా చేయడానికి ముందు తాను చాలా కథలు విన్నానని.. కానీ ఈ కథ ప్రత్యేకంగా అనిపించి ఒప్పుకున్నానని.. ఇందులో తన క్యారెక్టర్ వైల్డ్‌గా, క్రేజీగా ఉంటుందని.. ఈ సినిమాలో ప్రేక్షకులు ఒక కొత్త వెంకీని చూస్తారని.. సినిమా పెద్ద విజయం సాధిస్తుందని వెంకీ ధీమా వ్యక్తం చేశాడు.