కెరీర్ క్లోజ్ అనుకున్న టైంలో ఒక ఛాన్స్

ఉత్తరాది భామలు చాలామంది తెలుగులో హీరోయిన్లుగా బలమైన ముద్ర వేసిన వాళ్లే. కానీ వాళ్లలో మన సినిమాలను, మన ప్రేక్షకులను బాగా ఓన్ చేసుకుని.. ఇక్కడి అమ్మాయిలా కలిసిపోయిన హీరోయిన్లు తక్కువమంది. ఈ జాబితాలో రాశి ఖన్నా పేరు కచ్చితంగా చెప్పుకోవాలి. చాలా త్వరగా తెలుగు నేర్చుకుని, తెలుగులో పాటలు పాడుతూ, హైదరాబాద్‌లో ఒక ప్రాపర్టీ కూడా కొనుక్కుని ఇక్కడే సెటిలయ్యేలా కనిపించిన అమ్మాయి రాశి ఖన్నా.

తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తోనే బలమైన ముద్ర వేసి ఆమె.. తర్వాత ‘తొలి ప్రేమ’ సహా కొన్ని చిత్రాలతో మెస్మరైజ్ చేసింది. ఎన్టీఆర్ సరసన చేసిన ‘జై లవకుశ’తో టాప్ లీగ్‌లోకి అడుగు పెట్టేలా కనిపించిన రాశి.. ఆ తర్వాత అనూహ్యంగా డౌన్ అయిపోయింది. వరుస పరాజయాలు ఆమె కెరీర్‌ను కిందికి లాగేశాయి. అందం, అభినయం, చలాకీతనం అన్నీ ఉన్నా.. ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పక్కా కమర్షియల్, థ్యాంక్‌యు.. ఇలా ఆమె చివరి మూడు తెలుగు చిత్రాలు ఒకదాన్ని మించి డిజాస్టర్లు కావడంతో టాలీవుడ్ కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్లే కనిపించింది. ఎలాంటి హీరోయిన్‌కైనా ఒక ఏడాది పాటు ఛాన్సులు ఆగిపోయాయంటే ఆటోమేటిగ్గా కెరీర్‌కు తెరపడిపోతుంది. రకుల్ ప్రీత్ ఇలాగే కనుమరుగైపోయింది. రాశికి అదే పరిస్థితి తలెత్తుతుందని అనుకుంటుండగా.. ఇప్పుడో మంచి ఛాన్స్ ఆమె తలుపు తట్టింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డతో ఆమె ‘తెలుసు కదా’ సినిమా చేయబోతోంది.

స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం కాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఈ రోజే అనౌన్స్ చేశారు. ఇందులో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి మరో కథానాయికగా నటిస్తోంది. టైటిల్ టీజర్ చూస్తే మంచి బడ్జెట్లోనే ఈ సినిమాను నిర్మిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాశి ఒకప్పుడు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువే కానీ.. ఇప్పుడు ఆమె ఉన్న స్థితిలో ఇది కూడా పెద్ద ఛాన్సే. మరి దీన్ని ఉపయోగించుకుని టాలీవుడ్‌లో కెరీర్‌ను పొడిగించుకుంటుందేమో చూడాలి.