రాజశేఖర్ ఇన్నాళ్లకు దిగి వచ్చాడు

టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన సీనియర్ హీరోల్లో రాజశేఖర్ ఒకడు. అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు లాంటి చిత్రాలతో 90వ దశకంలో ఆయన ఊపు మామూలుగా ఉండేది కాదు. కానీ 2000 తర్వాత రాజశేఖర్ వైభవం అంతా కరిగిపోతూ వచ్చింది. ట్రెండుకు తగ్గ సినిమాలు తీయక రేసులో బాగా వెనుకబడిపోయాడు ఈ సీనియర్ హీరో. కొన్నేళ్ల ముందు ఆయన మార్కెట్ దాదాపుగా జీరో అయిపోయింది.

ఇక మళ్లీ రైజ్ కావడం కష్టం అనుకుంటున్న దశలో ‘గరుడవేగ’తో మళ్లీ ఓ సక్సెస్ అందుకున్నాడు. దీని తర్వాత ఆయన చేసిన ‘కల్కి’కి మంచి హైపే వచ్చింది. కానీ ఆ హైప్‌కు తగ్గట్లు సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర నిరాశాజనక ఫలితం తప్పలేదు. మళ్లీ పుంజుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించట్లేదు. రాజశేఖర్ చివరి సినిమా ‘శేఖర్’ వచ్చింది వెళ్లింది కూడా తెలియని పరిస్థితి. ఆ తర్వాత కొత్త సినిమా ఏదీ మొదలుపెట్టలేదాయన.

ఐతే సీనియర్ హీరోల్లో చాలామంది మార్కెట్ కోల్పోయాక.. నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్ వైపు చూడటం మామూలే. కానీ రాజశేఖర్ మాత్రం అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. తనకు ‘ధృవ’లో అరవింద్ స్వామి చేసిన క్యారెక్టర్ లాంటిది వస్తే తప్ప క్యారెక్టర్ రోల్స్ చేయను అని ఆయన భీష్మించుకుని కూర్చున్నాడు.

ఐతే ఇప్పుడు అలాంటి పాత్రే వచ్చిందా లేక కాంప్రమైజ్ అయ్యాడా తెలియదు కానీ.. ఎట్టకేలకు రాజశేఖర్ క్యారెక్టర్ రోల్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. నితిన్ కొత్త చిత్రం ‘ఎక్స్‌ట్రా.. ఆర్డినరీ మ్యాన్’లో రాజశేఖర్ ఒక స్పెషల్ రోల్ చేశాడట. ఇటీవలే ఆ పాత్రకు సంబంధించి చిత్రీకరణ మొదలైనట్లు తెలిసింది. సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ఈ పాత్ర కోసం రాజశేఖర్ ఎంపిక కావడం విశేషం. ఈ పాత్ర క్లిక్ అయితే రాజశేఖర్ నుంచి మున్ముందు క్యారెక్టర్, విలన్ పాత్రలు మరిన్ని చూడొచ్చేమో.