బిచ్చగాడు హీరోకి మళ్ళీ నిరాశే

ఇటీవలే కూతురిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ ఆ గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి తిరిగి సినిమా ప్రపంచంలోకి వచ్చేశాడు. అతని కొత్త చిత్రం రత్తం గత వారం ఆరో తేదీ తమిళనాడులో గ్రాండ్ గా రిలీజయ్యింది. తెలుగులో విపరీతమైన పోటీతో పాటు ప్రమోషన్లకు టైం లేకపోవడంతో డబ్బింగ్ వెర్షన్ వాయిదా వేశారు. ట్రైలర్ చూసినప్పుడు దీని మీద చెప్పుకోదగ్గ అంచనాలే నెలకొన్నాయి. అందులోనూ గెటప్ కాస్త డిఫరెంట్ గా అనిపించడంతో ఫ్యాన్స్ మళ్ళీ హిట్టు పడుతుందేమోనని ఎదురు చూశారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మళ్ళీ నిరాశ తప్పలేదు.

కథ పరంగా రత్తంది కాస్త డిఫరెంట్ లైనే. కోల్కతాలో గుర్రాల కాపరిగా ఉన్న రంజిత్(విజయ్ ఆంటోనీ) ఒకప్పటి తన మీడియా గురువు (నిజగల్ రవి) కొడుకు హత్య చేయబడిన కారణంగా చెన్నైకి తిరిగి వచ్చి ఆయన సంస్థలోనే చేరతాడు. మధుమిత(నందిత దాస్) దగ్గర అప్రెంటీస్ గా ఉద్యోగం వేయించుకుని అలాంటి మర్డర్ల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఇతని మీద పెత్తనం చెలాయించాలని చూసిన మధుమితకు రంజిత్ ఒకప్పుడు సెలబ్రిటీ జర్నలిస్ట్ అని తెలుస్తుంది. తర్వాత ఈ దారుణాలు ఎవరు చేశారు, వెనుక ఉన్న చీకటి కోణాలు వెలికి తీయడమే అసలు స్టోరీ

బాషా, సమరసింహారెడ్డి టైపులో అండర్ కరెంట్ హీరోయిజంని ఒక సోషల్ ఇష్యూకి ముడిపెట్టాలని చూసిన డెబ్యూ దర్శకుడు సిఎస్ ఆముదన్ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఫెయిలయ్యాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం విపరీతమైన స్లో నెరేషన్ తో ఇంటరెస్టింగ్ గా ఉండాల్సిన స్క్రీన్ ప్లే కాస్తా బోరింగ్ గా సాగుతుంది. రెండో సగంలో వేగం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో టెంపో పండకపోవడంతో రత్తం కిక్ ఇవ్వలేకపోయింది. తమిళంలోనే సోసోగా ఆడుతున్న రత్తంలో ఒకవేళ తెలుగులో వచ్చినా ఆడటం కష్టమే. ఆ మధ్య ఇలాగే కుట్ర రిలీజ్ చేస్తే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు.