ద‌స‌రా సినిమాలు.. చాలాసేపు కూర్చోవాలి

ఇండియాలో ఒక‌ప్పుడు సినిమాల నిడివి మినిమం రెండున్న‌ర గంట‌లు ఉండేది. రెండున్న‌ర గంట‌లు అన్న‌ది స్టాండ‌ర్డ్ ర‌న్ టైం కాగా.. చాలా వ‌ర‌కు సినిమాలు అంత‌కంటే ఎక్కువ నిడివితోనే ఉండేవి. కానీ సోష‌ల్ మీడియా ఊపందుకున్నాక కొంచెం నిడివి ఎక్కువ అయితే ల్యాగ్ ల్యాగ్ అన‌డం ఎక్కువైంది. దీంతో   ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర క‌త్తెర‌కు ప‌ని చెప్ప‌డం ఎక్కువైంది. పాట‌లు, అన‌వ‌స‌ర సీన్లు తీసేసి 2-2.15 గంట‌ల నిడివితో సినిమాలు రిలీజ్ చేయ‌డం ఎక్కువైంది.

కానీ ఈ మ‌ధ్య మ‌ళ్లీ ట్రెండ్ మారుతోంది. కంటెంట్ ఉంటే నిడివి పెద్ద స‌మ‌స్య కాద‌న్న అభిప్రాయం బ‌ల‌ప‌డి.. ఈ మ‌ధ్య పెద్ద సినిమాల‌న్నీ కూడా ఎక్కువ నిడివితోనే రిలీజ‌వుతున్నాయి. అర్జున్ రెడ్డి, రంగ‌స్థ‌లం లాంటి సినిమాలు ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో నిడివి 3 గంట‌లైనా పెద్ద‌గా కంగారు ప‌డ‌ట్లేదు. ఈ ద‌స‌రాకు రాబోయేవ‌న్నీ పెద్ద నిడివి ఉన్న సినిమాలే కావ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ర‌వితేజ సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావుకు సెన్సార్ పూర్తి చేశారు. ఆ సినిమా ర‌న్ టైం 3 గంట‌ల 2 నిమిషాల‌ట‌. మ‌రీ ఇంత నిడివి అంటే ఆడియ‌న్స్ త‌ట్టుకుంటారా అన్నది సందేహ‌మే. కానీ సినిమా బ‌ల‌మైన కంటెంట్‌తోనే వ‌స్తున్న‌ట్లుంది.

ఇక త‌మిళ అనువాద చిత్రం లియోకు కొన్ని రోజుల ముందే సెన్సార్ పూర్త‌యింది. దాని ర‌న‌ట్ టైం రెండు ముప్పావు గంట‌ల దాకా ఉంది. ఇక బాల‌య్య సినిమా భ‌గ‌వంత్ కేస‌రి సైతం పెద్ద సినిమానే అని టాక్. అది కూడా 2 గంట‌ల 40 నిమిషాల‌కు పైగా నిడివితో రిలీజ కాబోతోంద‌ట‌. త్వ‌ర‌లోనే ఆ చిత్రానికి కూడా సెన్సార్ పూర్తి చేయ‌బోతున్నారు. ఈ సినిమాల‌కు టాక్ బాగుంటే ర‌న్ టైం స‌మ‌స్య కాదు. కానీ బాలేని సినిమాల‌కు మాత్రం నిడివి స‌మ‌స్య‌గా మారొచ్చు. భ‌గ‌వంత్ కేస‌రి, లియో ఈ నెల 20న రిలీజ‌వుతుండ‌గా.. త‌ర్వాతి రోజు టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు వ‌స్తుంది.