అనిరుధ్ లోకేష్ ‘ఎస్’ విజయ్ ‘నో’

దసరా పోటీని దృష్టిలో పెట్టుకుని భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావులకు ధీటుగా ప్రమోషన్ల చేసేందుకు హక్కులు కొన్న సితార సంస్థ ప్రత్యేకంగా డిజైన్ చేస్తోందట. దీని కోసం హైదరాబాద్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. అతిథులుగా ఎవరిని పిలవాలనే నిర్ణయం ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం. అసలు హీరో విజయ్ రాకుండా కేవలం తాము మాత్రమే వచ్చి అతన్ని పొగడటం వల్ల ఒక తమిళ సినిమాని ప్రోత్సహించినట్టు తమ అభిమానులు నెగటివ్ ఫీలయ్యే ప్రమాదం ఉందని పసిగట్టి దగ్గరకి వచ్చిన ప్రతిపాదనని కొందరు పెండింగ్ లో ఉంచినట్టు వినికిడి.

ఈ వేడుకలో అనిరుద్ రవిచందర్ తో లైవ్ స్టేజి పెర్ఫార్మన్స్ ఇప్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మధ్య జైలర్ లాంటి ఈవెంట్స్ లో తను చేసిన సందడి వాటి ప్రమోషన్స్ కి చాలా ప్లస్ అయ్యింది. అందుకే ఈసారి నేరుగా పాడించి అభిమానులను సంతోష పెట్టే ప్రయత్నం చేస్తారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో పాటు హీరోయిన్ త్రిష తదితర లియో బృందం మొత్తాన్ని అక్కడ చూసుకోవచ్చు. అయితే ఎన్ని రకాలుగా కన్విన్స్ చేయాలని చూస్తున్నా విజయ్ మాత్రం ససేమిరా అంటున్నాడట. ఆ మధ్య చెన్నైలో ప్లాన్ చేసిన తమిళ ఈవెంట్ రద్దు చేయడం తెలిసిందే

మరి అక్కడ జరపనిది ప్రత్యేకంగా పక్క రాష్ట్రంలో చేస్తే విజయ్ ఫ్యాన్స్ హర్ట్ కావడం సహజం. అందుకే నో చెప్పారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయినా భూమి బద్దలైనా సరే డబ్బింగ్ వెర్షన్ ఈవెంట్లకు విజయ్ ఎన్నడూ రాలేదు. రాడు. వారసుడు టైంలో దిల్ రాజు చాలా ట్రై చేశారు కానీ కుదరలేదు. కేవలం ఇంట్లో చేసుకున్న సక్సెస్ పార్టీకి గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వెళ్ళాడు అంతే. సో ఊరికే ఆశించడం కూడా వేస్ట్. ట్రైలర్ వచ్చాక హైప్ కొంత హెచ్చుతగ్గులకు గురైన ట్విట్టర్ లో మాత్రం లియో ట్రెండింగ్ లోనే ఉంది. ఉన్నాడో లేదో తెలియని రామ్ చరణ్ క్యామియో గురించే ఎక్కువ చర్చ జరగడం ఫైనల్ ట్విస్ట్.