యుద్ధం ప్రభావం బాక్సాఫీసు మీద ఉంటుందా

ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా పడటం నిన్నటి నుంచి మొదలయ్యింది. ఎల్పిజి గ్యాస్ కొరతతో ఇప్పటికే బెంగళూరు, చెన్నైలో అత్యధిక శాతం హోటళ్లు మూతబడగా నెక్స్ట్ హైదరాబాద్ కూడా అదే లిస్టులో చేరబోతోంది. నగరాల్లో ఉన్న వేలాది హాస్టళ్లు తాత్కాలికంగా మూసివేసే దిశగా వెళ్తున్నాయి.

ఇకపై పెట్రోల్, డీజిల్ కొరత రాదని చెప్పలేం. ఇది మొదలైతే మాత్రం పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. బయట వస్తువులు, సేవల రేట్లు చుక్కలను తాకుతాయి. రవాణా ఖర్చులు తలకు మించిన భారం అవుతాయి. అప్పుడు పాలు, నీళ్లు, కూరగాయలు ఏదైనా సరే మూడు నాలుగింతలు ఎక్కువ రేట్లు పెట్టి కొనాల్సి ఉంటుంది. ఒకవేళ సిచువేషన్ ఇలాగే ఉంటే బాక్సాఫీస్ మీద ప్రభావం ఉంటుందా.

ఈ ప్రశ్నకు సమాధానం ఔననే చెప్పాలి. ఎందుకో చూద్దాం. రవాణా భారమై, గ్యాస్ పెట్రోల్ దొరక్క, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు సామాన్యులకు రోజు గడవడమే గండంగా మారుతుంది. అలాంటప్పుడు టికెట్లు కొని సినిమాలు చూసే మూడ్ ఉండదు. అసలు థియేటర్లు నడవాలంటే కూడా ఇంధనం అవసరం. రోజువారీ ఖర్చులు, జీతాలు, నిర్వహణ, జనరేటర్లు ఇలా బోలెడు తతంగాలు ఉంటాయి.

రెస్టారెంట్లకు వచ్చిన సమస్యే మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్ల క్యాంటీన్లకు వస్తుంది. గ్యాస్ లేక తిండి పదార్థాలు అమ్మలేరు. అంటే వచ్చే ఆదాయంలో కోత పడుతుంది. అసలే దురంధర్ రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ రిలీజులకు హౌస్ ఫుల్స్ పడతాయి. కేవలం టికెట్ల ద్వారా వచ్చే రెవిన్యూతో ఎగ్జిబిటర్లు లాభపడరు. వాళ్లకు ఫుడ్ సేల్స్ కూడా ముఖ్యమే. ఇది తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది.

ఇంకో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వాల వైపు నుంచి దేనికీ కొరత ఉండదని హామీ వస్తే జన జీవనం సవ్యంగా ఉంటుంది. లేదంటే తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. అసలే ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఫీడింగ్ లేక థియేటర్లు గగ్గోలు పెడుతున్నాయి. సరిగ్గా మంచి సినిమాలు వస్తున్న టైంలో ఇలా వార్ అంటే అందరికీ నరకమే. మనం నేరుగా యుద్ధంలో లేకపోయినా దాని ప్రభావంతో యుద్ధం చేయాల్సి వస్తోంది.