జాతిరత్నాలకు ఆమడ దూరంలో మ్యాడ్  

మొన్న శుక్రవారం చేపల మార్కెట్ ని తలపించేలా మూకుమ్మడి దాడి చేసిన ఏడెనిమిది కొత్త సినిమాల్లో ఒక్క మ్యాడ్ మాత్రమే మంచి టాక్ తో పాటు కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ అన్నట్టు మీకు నవ్వు రాకపోతే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తాననే హామీకి ఎలాంటి ముప్పు రాలేదు. అయితే ఆయన ప్రత్యేకంగా జాతిరత్నాలుని మించిన ఫన్ ఉంటుందని నొక్కి చెప్పిన మాట మాత్రం నిజమయ్యేలా లేదని కలెక్షన్లు ఋజువు చేస్తున్నాయి. మొదటి వీకెండ్ దాకా బాగానే ఉన్నా ఇవాళ్టి నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలోనే డ్రాప్ కనిపించడం కొంత టెన్షన్ రేపుతోంది.

జాతిరత్నాలు టైంని గుర్తు చేసుకుంటే ఆ సినిమా ఏకధాటిగా కనీసం పది రోజులకు పైగా మెయిన్ సెంటర్స్ అన్నింటిలోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబట్టింది. ఫైనల్ రన్ అయ్యేలోపు ముప్పై కోట్లకు పైగా వసూళ్లతో వామ్మో అనిపించింది. కానీ మ్యాడ్ కి అంత రేంజ్ రావడం అసాధ్యమే. కేవలం యూత్ మాత్రమే ఎంజాయ్ చేసే కంటెంట్ కావడంతో ఫ్యామిలీస్ కాస్త దూరంగా ఉంటున్నాయి. వాటిలో జోకులు కుర్రకారుకి కనెక్ట్ అయినంతగా కుటుంబాలకు కావు. కానీ జాతిరత్నాలు క్లాస్ మాస్ ఇద్దరినీ మెప్పించిన దర్శకుడి అనుదీప్ మార్క్ క్లీన్ కామెడీతో భారీ సక్సెస్ అందుకుంది.

సో ఎలా చూసుకున్న మ్యాడ్ జాతిరత్నాలుని టచ్ చేయడం కానీ దాటడం కానీ జరగని పని. మొదటి వారాంతం అయిదు కోట్ల దగ్గరగా గ్రాస్ వచ్చిందని సితార సంస్థ ప్రకటించింది. తిరిగి శుక్రవారం నుంచి పికప్ అవుతుందనుకున్నా ఇదే స్థాయిలో ఫిగర్స్ వస్తాయని ఆశించలేం. కొత్త రిలీజులు పెద్దగా లేకపోయినా సరే మ్యాడ్ హిట్ అనిపించుకోవడం మినహాయించి బ్లాక్ బస్టర్ ముద్ర వేయించుకోవడం అనుమానమే. అయినా కాలేజీలు ఎగొట్టి బ్యాచులుగా రావాల్సిన స్టూడెంట్స్ మ్యాడ్ వైపు వేలంవెర్రిగా వచ్చి ఉంటే ఇప్పుడు సీన్ ఇంకోలా ఉండేది. రిపీట్ వేల్యూ ఉన్న పాటలు లేకపోవడమూ ముఖ్యమైన కారణం.