14 రోజులకే డిజిటల్ ఏంటి మామా

సినిమా హిట్టో ఫ్లాపో థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం అవసరం. కరోనా టైంలో ఇది మరీ కుదించుకుపోవడంతో నిర్మాతల మండలి ఒక మీటింగ్ పెట్టుకుని మరీ ఎనిమిది వారాల గడువును విధించుకున్నారు. తీరా చూస్తే అందులో పెద్దలే పాటించలేని పరిస్థితులు నెలకొన్నాయి. బాలీవుడ్ లాగా ఖచ్చితంగా రెండు నెలల నిబంధన పెట్టుకునేందుకు మల్టీప్లెక్సులు బెదిరించేంత సీన్ లేదు. అందుకే నెల రోజులకే పెద్ద హీరోల సినిమాలు సైతం డిజిటల్ బాట పట్టేస్తున్నాయి. జైలర్ నెలకు, బేబీ యాభై రోజులకు ఇలా రీజనబుల్ గా అనిపించే గ్యాప్ తో వచ్చాయి.

పట్టుమని ఇంకా మూడో రోజు కూడా పూర్తి కాని మామా మశ్చీంద్ర ఈ అక్టోబర్ 20న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ జరగబోతున్నట్టు వచ్చిన వార్త ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. సుధీర్ బాబు త్రిపాత్రాభినయంతో హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద తిరస్కారానికి గురయ్యింది. చాలా చోట్ల థియేటర్ అద్దెలు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చాలా చోట్ల దీని స్థానంలో వేరే సినిమాలు వేసేందుకు ఎగ్జిబిటర్లు రెడీ అవుతున్నారు. సరే ఇలాంటి డిజాస్టర్లు టాలీవుడ్ కు కొత్తేమి కాదు. ఏడాదికి కనీసం పది నుంచి పాతిక దాకా ఉంటాయి.

అది కాదు సమస్య. కేవలం పద్నాలుగు రోజులకే ఓ కొత్త సినిమా ఓటిటికి వస్తే అది కూడా పేరున్న హీరోది అయితే జనాన్ని ఇంకా థియేటర్లకు దూరం చేసిన వాళ్ళం అవుతాం. పైగా బాగుంటేనే టికెట్లు కొనండి లేదంటే వద్దని చెప్పినట్టు అవుతుంది. అగ్రిమెంట్ చేసుకునే టైంలోనే ఓటిటి సంస్థలు చాలా స్పష్టంగా రిలీజ్ డేట్లతో సహా సంతకాలు తీసుకుంటాయి. అక్కడ ఆలోచించుకోవాల్సింది నిర్మాతే. అయినా ప్రమోషన్ల విషయంలో చాలా యాక్టివ్ గా ఉండే ఏషియన్ ఫిలింస్ ఈ మామా మశ్చీంద్ర విషయంలో ఏమంత దూకుడు చూపించలేదు. నిర్మాత సునీల్ నారంగ్ ఇదంతా ముందే ఊహించారేమో.