పూరికి మేలుకొలుపు పాడిన స్కంద

మాస్ లో పట్టు సాధించాలని చాలా బలంగా ప్రయత్నిస్తున్న రామ్ కు వరసగా ది వారియర్, స్కందలు పెద్ద షాక్ ఇచ్చాయి. మార్కెట్ పెరగాలంటే కమర్షియల్ స్కేల్ పెంచుకోవడం ఒకటే మార్గమని గుర్తించి దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్న రామ్ సంగతేమో కానీ ఇప్పుడీ ఫలితం పూరి జగన్నాధ్ కి మేలుకొలుపు పాడింది. ఇస్మార్ట్ శంకర్ కి కొనసాగింపు డబుల్ ఇస్మార్ట్ ని శరవేగంతో పూర్తి చేసే పనిలో పడ్డ పూరికి మితిమీరిన మాస్ తో రామ్ మీద అనవసర ప్రయోగం చేస్తే ప్రేక్షకులు అంగీకరించరనే క్లారిటీ వచ్చింది. ఏదైనా తనకు తగ్గట్టు టోన్ చేస్తేనే కనెక్ట్ అవుతామనే సందేశం జనం ఇచ్చారు.

ఇంకా షూటింగ్ బోలెడు బాలన్స్ ఉన్న డబుల్ ఇస్మార్ట్ లో ఇప్పటిదాకా తీసింది కాకుండా ఇకపై తీయబోయే దాన్ని మరోసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం పడింది. ఇస్మార్ట్ శంకర్ నాటి పరిస్థితులకు ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. అది ఆడి వెళ్ళిపోయాక కరోనా వచ్చింది. జనాల అభిరుచుల్లో, మార్కెట్ పరిస్థితుల్లో బోలెడు చేంజ్ కనిపిస్తోంది. దానికి అనుగుణంగా పూరి మెప్పించాల్సి ఉంటుంది. పైగా సంగీతం విషయంలో తమన్ నిరాశపరచడం స్కంద ప్రీ రిలీజ్ హైప్ ని బాగా దెబ్బ కొట్టింది. మంచి ఆల్బమ్ పడకపోతే దాని ఎఫెక్ట్ నేరుగా అంచనాల మీద పడుతోంది.

ఇక్కడ పూరి అలెర్ట్ కావాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఓవర్ ది బోర్డ్ రామ్ హీరోయిజం వెళ్తోందా అనేది చెక్ చేసుకోవాలి. మణిశర్మ నుంచి బెస్ట్ సాంగ్స్ రాబట్టుకోవడానికి ఆయన్ని వేధించి అయినా సరే ఛార్ట్ బస్టర్స్ కంపోజ్ చేయించాలి. సంజయ్ దత్ లాంటి బ్యాకప్ దొరికాడు కాబట్టి లైగర్ లో మైక్ టైసన్ ని వృథా చేసుకున్నట్టు కాకుండా ఖరీదైన పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. స్క్రిప్ట్ లాక్ అయినా సరే అప్పటికప్పుడు ఆలోచనలు జెట్ స్పీడ్ తో మార్చేసుకునే పూరికి ఇప్పుడు బాక్సాఫీస్ తత్వం బోధపడింది కనక డబుల్ ఇస్మార్ట్ తన ఒక్కడికే కాదు రామ్ కు సైతం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.