గుంటూరు కారం పాత్రలు సంబంధాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. చిన్న టీజర్, రెండు మూడు పోస్టర్లు తప్ప దీనికి సంబంధించిన క్రేజీ ఇన్ఫో ఏదీ బయటికి రాలేదు. మొదటి లిరికల్ వీడియోను దసరా లోపే ప్రకటిస్తామని ఇటీవలే నిర్మాత నాగ వంశీ మ్యాడ్ ఫంక్షన్లో చెప్పిన నేపథ్యంలో అభిమానులు దాని కోసం ఎదురు చూస్తున్నారు. రికార్డింగ్ అయ్యింది కానీ మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇది కాకుండా లీకుల రూపంలో వస్తున్న కొన్ని సంగతులు ఆసక్తి రేపెలా ఉన్నాయి.

ముఖ్యంగా పాత్రలు వాటి మధ్య సంబంధాలు విశేషాలు చూద్దాం. గుంటూరు కారంలో మహేష్ బాబు తల్లి తండ్రులుగా జయరాం, రమ్యకృష్ణ కనిపిస్తారు. నాన్నమ్మ, తాతయ్యలుగా ప్రకాష్ రాజ్, జయసుధలు నటించారు. ఈ కుటుంబానికి శక్తివంతమైన రాజకీయ పార్టీ ఉంటుంది. స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఇదే కీలకం. వీళ్ళ పార్టీలోని కీలక సభ్యుడే మురళీశర్మ. ఆయన కూతురు శ్రీలీల. రెండు ఫ్యామిలీల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి. ఇక సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి రావు రమేష్ గారమ్మాయి. సునీల్ మహేష్ స్నేహితుడిగా, వెన్నెల కిషోర్ మురళి శర్మ పిఎగా చేశాడు.

సెటప్ మొత్తం నీట్ గా సెట్ చేసుకున్న త్రివిక్రమ్ దీనికి పొలిటికల్ ఫ్లేవర్ అద్దడం వల్ల చాలా కొత్తగా ఉంటుందని పని చేసిన వాళ్ళు అంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబుతో రాజకీయ విసుర్లతో పాటు పోకిరి రేంజ్ లో ఊర మాస్ డైలాగులు వింటారని తెగ ఊరిస్తున్నారు. ఇవన్నీ అధికారికంగా వచ్చిన వివరాలు కాదు కానీ మంచి హైప్ ఇచ్చేలా ఉన్నాయి. జనవరి 12 ఎట్టి పరిస్థితుల్లో విడుదల కావాలని నిర్ణయించుకున్న గుంటూరు కారం ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లను తద్వారా థియేటర్లను లాక్ చేసుకునే పనిలో ఉందని సమాచారం. సంక్రాంతికి మళ్ళీ జెండా ఎగరడం ఖాయమని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.