బోయపాటి బలహీనతలు తెలుసుకోవాల్సిందే

Boyapati

మాస్ మసాలా సినిమాలు తీయడంలో ప్రత్యేకమైన ముద్ర సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శీనుకి తన బలం కంటే ఎక్కువ బలహీనతలు గుర్తించాల్సిన అవసరం వచ్చేసింది. తొలి రెండు చిత్రాలు భద్ర, తులసి మినహాయిస్తే సింహ నుంచి ఒకరకమైన లౌడ్ హీరోయిజం వైపు టర్న్ తీసుకున్న బోయపాటి సింహా, లెజెండ్, అఖండలతో బ్లాక్ బస్టర్స్ సాధించారంటే వాటిలో తన ప్రతిభ ఎంతుందో అంతకు రెట్టింపు బాలకృష్ణ స్టామినా ఆ కంటెంట్ ని నిలబెట్టిన వైనం మర్చిపోకూడదు. ఈ మూడు ఇంకో ఏ స్టార్ హీరో చేసినా ఈ స్థాయిలో ఇంపాక్ట్ ఉండేది కాదనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం.

క్రమంగా బోయపాటి శీను ఓవర్ మాస్ వైపు వెళ్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులైనా జిల్లా కలెక్టర్లైనా హీరో ముందు మరీ తీసికట్టుగా ప్రవర్తించడం సామాన్య జనాలకు రుచించడం లేదు. దమ్ము,జయ జానకి నాయకలోనూ ఈ పొరపాట్లు జరిగాయి. అందుకే అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. తాజాగా స్కందలో నేలవిడిచి చేసిన సాము గారడీలు లెక్కలేనన్ని పెట్టారు. ఒక యువకుడు నేరుగా హెలికాఫ్టర్ వేసుకొచ్చి సిఎం కూతుర్ని ఎత్తుకుపోతుంటే బ్లాక్ క్యాట్ కమాండోలు తమాషా చూడటం లాంటి చమక్కులు ఎన్నో పెట్టారు. రామ్ డ్యూయల్ రోల్ ని ఖంగాళీ చేసి క్లారిటీ కోసం రెండో భాగం చూడమన్నారు.

ఇలాంటివి ఇకపై రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి. అఖండ 2 ఎప్పుడు ఉంటుందో తెలియదు. నెక్స్ట్ తమిళ హీరో సూర్యతో సినిమా ఉందని ఆల్రెడీ టాక్ ఉంది. అఫీషియల్ గా ప్రకటించలేదు. బాలయ్యని డీల్ చేసినట్టు అందరు హీరోలకి ఒకటే సూత్రం వర్తింపజేస్తే వర్కౌట్ కాదని బోయపాటి త్వరగా రియలైజ్ అవ్వాలి. ఇస్మార్ట్ శంకర్ లాగా స్కంద బ్లాక్ బస్టర్ అయ్యుంటే రామ్ రెండో భాగం గురించి ఎక్కువ ఆలోచించేవాడు కాదు కానీ ఇప్పుడేం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. స్కంద 2 ఉంటుందని బోయపాటి అంటున్నారు కానీ ఫైనల్ రన్ అయ్యాక కూడా అదే మాట మీదుంటే నమ్మొచ్చు.