సిద్దార్థకు జైలర్ నరసింహ క్షమాపణ

నిన్న బెంగళూరులో తన కొత్త సినిమా చిత్తా ప్రమోషన్ కోసం వచ్చిన హీరో సిద్దార్థ్ ని కావేరి జలాల కోసం పోరాడుతున్న నిరసనకారులు అడ్డుకుని ప్రెస్ మీట్ నుంచి బయటికి పంపించడం పెద్ద దుమారం రేపింది. ఈ ప్రవర్తన ఎంత మాత్రం సమర్ధనీయం కాదంటూ స్వంత కన్నడ వర్గాల నుంచే వ్యతిరేకత ఎదురయ్యింది. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి, అందులోనూ ఇష్యూకి ఎలాంటి సంబంధం లేని ఆర్టిస్టుని పట్టుకుని ఇలా చేయడం స్వంత పరువు తీసుకోవడం లాంటిదని సోషల్ మీడియా వేదికగా అధిక శాతం నెటిజెన్లు అభిప్రాయపడ్డారు. డ్యామేజ్ గట్టిగానే అయ్యింది.

నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా సారీ చెప్పారు. తాజాగా కన్నడ సీనియర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఒక పబ్లిక్ ఈవెంట్ లో వేలాది మంది సమక్షంలో సిద్దార్థ్ కు క్షమాపణ చెప్పారు. తమవాళ్లు భాషతో సంబంధం లేకుండా అందరినీ ప్రేమిస్తారని, దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని సినిమాలు ఆడే సంస్కృతి ఒక్క కర్ణాటకలో మాత్రమే ఉందని చెబుతూ నిన్న జరిగిన దురదృష్టకర సంఘటన మళ్ళీ పునరావృత్తం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. వేదికపై పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉండగానే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.

జైలర్ లో నరసింహగా చిన్న క్యామియోతోనే అదరగొట్టిన శివరాజ్ కుమార్ నుంచి ఈ స్పందనకు తమిళులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది పెద్ద మనిషి చూపించే గౌరవమని పొగుడుతున్నారు. కావేరి వివాదంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరిపిన బంద్ పెద్ద సక్సెస్ అయ్యింది. రెండు ప్రభుత్వాల మధ్య పరిష్కారం దొరక్కపోయినా ప్రజలు మాత్రం స్వచ్చందంగా ఉద్యమంలో భాగమవుతున్నారు. సిద్దార్థ్ దేనికోసమైతే ఈ అవమానం భరించాడో ఆ చిత్తా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగులో త్వరలోనే డబ్బింగ్ వెర్షన్ విడుదలకు ఏర్పాల్టు చేస్తున్నారు.