పాపం చంద్రముఖి.. ఆయన చేతిలో బందీ 

చంద్రముఖిని చూస్తే అందరికీ భయం కలగాలి. కానీ ఇప్పుడు చంద్రముఖిని చూసి నవ్వుకోవడమే కాక.. జాలిపడుతున్నారు ప్రేక్షకులు. పి.వాసు అనే వ్యక్తి చేతిలో చంద్రముఖి బందీ అయిపోయి నానా హింసలు పడుతున్నందుకే ఈ జాలి. 90వ దశకంలో మలయాళంలో సంచలనం రేపిన ‘మణిచిత్రతాళు’ అనే సినిమాను ‘చంద్రముఖి’ పేరుతో రీమేక్ చేసి సెన్సేషనల్ హిట్ కొట్టాడు పి.వాసు. నిజానికి దర్శకుడిగా అప్పటికే ఆయన పనైపోయింది.

కానీ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘చంద్రముఖి’ చేసి మళ్లీ చాలా కాలానికి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సినిమా విషయంలో పి.వాసు కొత్తగా చేసిందేమీ లేదు. కథలో ఉన్న బలానికి రజినీ చరిష్మా.. జ్యోతిక అద్భుత నటన తోడై ‘చంద్రముఖి’ భారీ విజయాన్నందుకుంది. ఈ సినిమా పుణ్యమా అని వాసుకు తర్వాత కూడా మంచి అవకాశాలు వచ్చాయి. అందులో ‘మహారథి’ ఒకటి. అదెంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. తర్వాత ఇక లాభం లేదని ‘చంద్రముఖి’ సీక్వెల్ తీశాడు తెలుగులో.

అదే.. నాగవల్లి. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేకపోయింది కాబట్టి సరిపోయింది లేదంటే పి.వాసు తీసిన ఆ కళాఖండం వెంకీకి ఎన్ని తలవంపులు తెచ్చిపెట్టేదో. ‘చంద్రముఖి’నే అటు ఇటు తిప్పి తీసి బాక్సాఫీస్ దగ్గర వెంకీకి తల బొప్పి కట్టేలా చేశాడు వాసు. ఆ తర్వాత ‘శివలింగ’ అని మరేదో హార్రర్ మూవీ తీశాడు. అది కూడా వర్కవుట్ కాలేదు. పి.వాసును అంతా మరిచిపోయిన సమయంలో రెండేళ్ల కిందట మళ్లీ తమిళంలో వేరుగా ‘చంద్రముఖి’ సీక్వెల్ తలపెట్టాడు. హార్రర్ కామెడీ స్పెషలిస్ట్ లారెన్స్ ఆయనకు తోడయ్యాడు. లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ సపోర్ట్ ఇచ్చింది.

నిన్ననే ఈ సినిమా రిలీజ్ కాగా.. చూసిన వాళ్లు బెంబేలెత్తిపోతున్నారు. ‘చంద్రముఖి’ సీక్వెల్ లాగా కాకుండా.. దాని స్పూఫ్ లాగా ఉందంటూ సినిమాను ఏకిపడేస్తున్నారు. రజినీ స్థానంలో లారెన్స్‌ను ఊహించకోవడం కూడా కష్టమే. ఇక అతను చేసిన ఓవరాక్షన్‌‌తో ప్రేక్షకులకు కళ్లు బైర్లు కమ్మాయి. కంగనా రనౌత్ సైతం ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఔట్ డేటెడ్ స్టోరీ, నరేషన్‌తో ప్రేక్షకులకు చుక్కలు చూపించాడు వాసు. ఇంకా ఎంత కాలం ‘చంద్రముఖి’ని పట్టుకుని వేలాడతారు అంటూ వాసు మీద ఆ సినిమా ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.