పెద్దాయన రివ్యూలు తేడా కొడుతున్నాయే

తరాలు మారుతున్నట్టే ఫిలిం మేకింగ్ లో కూడా బోలెడు ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు శంకరాభరణం లాంటి క్లాసిక్స్ ని క్లాసు మాస్ తేడా లేకుండా బ్రహ్మాండంగా ఆదరించారు. ఎర్ర సైన్యం లాంటి రెవల్యూషన్ చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి.  ఇప్పుడలాంటివి తీస్తే ఎవరూ చూడరు. అయితే వాటితో పోల్చి ఇప్పుడొచ్చే వాటిని తక్కువ చేసి చూడటం కరెక్ట్ కాదు. బాలీవుడ్ సీనియర్ మోస్ట్ నటుడు నసీరుద్దీన్ షా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎమోషన్, సీరియస్ ఇలా ఆయన టచ్ చేయని జానర్, పాత్రలు ఏవీ లేవు.

అంత అనుభవమున్న పెద్దాయన ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొత్త సినిమాల గురించి రివ్యూల టైపులో రెండు ముక్కలు పంచుకున్నారు. అవేంటంటే పుష్ప, ఆర్ఆర్ఆర్ తనింకా చూడలేదట. హీరోయిజంని మితిమీరి ఎక్స్ ప్లాయ్ట్ చేసే ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని, ఏ అజెండా లేకుండా మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ చాలా బాగా నచ్చిందని కితాబిచ్చారు. ఇక్కడ మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే చూడకుండానే సుకుమార్, రాజమౌళిని సర్టిఫై చేసిన షా గారు పొన్నియిన్ సెల్వన్ తమిళనాడులో తప్ప ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదనే పాయింట్ మిస్సయ్యారేమో.

ఎవరు ఏ సినిమా తీసినా ప్రతి ఒక్కరికి అజెండా ఉండే తీరుతుంది. మణిరత్నం దానికి మినహాయింపు కాదు. చోళ సామ్రాజ్య చరిత్రను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే పాత్రల పేర్లు ఎంత కన్ఫ్యూజ్ చేసినా వాటితోనే అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. అలాంటప్పుడు ఏ ఉద్దేశం లేదని చెప్పడం రైట్ కాదుగా. ఒకవేళ పుష్ప, ఆర్ఆర్ఆర్ లు చూశాక నచ్చలేదని చెబితే సంతోషమే. ఒకటి జాతీయ అవార్డు తీసుకొస్తే మరొకటి ఆస్కార్ కు వెళ్లి పురస్కారం అందుకుంది. మరి అది విస్మరించి అజెండా అంటూ కేవలం ఒకవైపే ఆలోచించడం కరెక్ట్ కాదేమో పెద్దాయనా.