ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న పెద్ది ప్రీమియర్ షోలు సాయంత్రం 8 నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొదలు కాబోతున్నాయి. భోపాల్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఇలా ప్రధాన నగరాలు అన్నింటిలోనూ ప్యాన్ ఇండియా ప్రమోషన్లు చేసిన టీమ్ ఎట్టకేలకు చివరి ఘట్టానికి చేరుకుంది..

జగపతిబాబు అన్నట్టు ఇండస్ట్రీకి ఇప్పుడీ పెద్ది సక్సెస్ చాలా అవసరం. ఎందుకంటే జనవరిలో సంక్రాంతి పండగ హడావిడి తర్వాత రోజుల తరబడి హౌస్ ఫుల్ బోర్డులు పెట్టిన సినిమా ఒక్కటి రాలేదు. అడదడపా డీసెంట్ హిట్లు ఉన్నాయి తప్పించి బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు గర్వంగా కాలర్ ఎగరేసుకునే బొమ్మ విడుదల కాలేదు. అందుకే నాలుగు నెలలుగా బాక్సాఫీస్ వద్ద ఏర్పడ్డ డ్రై వాతావరణం వీరభద్రుడు, బ్లాస్ట్ జోన్ లాంటి డబ్బింగ్ సినిమాలకు అవకాశం కలిగించింది.

సో పెద్దికి ఇవాళ రాత్రి రాబోయే టాక్ చాలా అంటే చాలా కీలకం. ముఖ్యంగా రివ్యూలు, సోషల్ మీడియా, పబ్లిక్ టాక్ పాత్ర ఎంతో ముఖ్యం కానుంది. మిక్స్డ్ లేదా యావరేజ్ కాదు యునానిమస్ అనిపించుకోవాల్సిందే. దర్శకుడు బుచ్చిబాబు, హీరో రామ్ చరణ్ నమ్మకం అయితే ఆ స్థాయిలోనే ఉంది. ఎక్కడా తొణక్కుండా శ్యుర్ షాట్ హిట్ అనే రీతిలో హామీలు ఇస్తున్నారు. అదే నిజమయ్యే పక్షంలో రెండు మూడు వారాలు టికెట్ కౌంటర్లు కిటకిటలాడతాయి.

వ్యక్తిగతంగా రామ్ చరణ్ కు పెద్ది పెద్ద స్థాయికి వెళ్లడం అవసరం. ఎందుకంటే గేమ్ చేంజర్ భారీ గాయం చేసింది. పెద్ది కోసం శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టాడు. సర్జరీ దాకా వెళ్లే రిస్కులు తీసుకున్నాడు. రెండేళ్లు కేటాయించాడు. ఇంత చేసినప్పుడు రిజల్ట్ కూడా దానికి అనుగుణంగానే రావాలి. రెహమాన్ సంగీతం, మూడుకి వందల కోట్ల ప్రొడక్షన్, క్యాస్టింగ్, రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్స్ పనితనం ఇవన్నీ పెద్ది మీద కొండంత కాన్ఫిడెన్స్ ని ఇచ్చాయి. ఆ గెలుపు తేలేది ఇవాళ రాత్రికే.