అత్తారింటికి దశాబ్దం –  మర్చిపోలేని పాఠం

పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సినిమా తీసి దాని విడుదల కోసం ఏర్పాట్లలో ఉండగా హఠాత్తుగా హెచ్డి ప్రింట్ తో మొత్తం లీకుల రూపంలో బయటికి వస్తే ఆ నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుంది. పదేళ్ల క్రితం బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ నరకం చూశారు. అప్పుడు 4జి లేదు. ఇంటర్నెట్ వ్యవహారం ఖరీదే. అయినా సరే నిమిషాల వ్యవధిలో అభిమానులు, ప్రేక్షకుల స్మార్ట్ ఫోన్లు,ల్యాప్ టాప్స్ లోకి సినిమా వెళ్లిపోయింది. దాంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ 27న ఆఘమేఘాల మీద అత్తారింటికి దారేది రిలీజ్ చేస్తే వసూళ్ల సునామిలో రికార్డులు కొట్టుకుపోయాయి.

థియేటర్లకు రాకముందే చాలా మంది సగం, పూర్తి సినిమా చూసినా సరే వెండితెరపై పవన్, త్రివిక్రమ్ చేసిన మేజిక్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రాపర్ థియేటర్ కంటెంట్ ఎలా ఉండాలో చూపించిన తీరు హౌస్ ఫుల్ బోర్డులను అంత త్వరగా తీయనివ్వలేదు. దేవీశ్రీ ప్రసాద్ హుషారైన పాటలకు ఆడియన్స్ పరవశించిపోయారు. నవ్వులు, కన్నీళ్లు, వెటకారాలు, ఫైట్లు, డాన్సులు ఒకటేమిటి కమర్షియల్ ప్యాకేజీకి కావాల్సిన అన్ని అంశాలను త్రివిక్రమ్ తూకమేసినట్టు కొలిచిన వైనం బ్లాక్ బస్టర్ ని మించి ఆడేసింది. వంద రోజులు దాటి సిల్వర్ జూబ్లీ దాకా సత్తా చాటింది.

ఈ రోజుతో అత్తారింటిది దారేది దశాబ్దం పూర్తి చేసుకుంది. దీన్ని పాఠమని ఎందుకు అనాలంటే కారణాలున్నాయి. జనాన్ని ఎలా మెప్పించాలో అర్థం కాక కొత్త జనరేషన్ డైరెక్టర్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న ట్రెండ్ లో లీకైనా పర్వాలేదు చెప్పే విషయంలో దమ్ముంటే పబ్లిక్ ఎగబడి థియేటర్లకు వస్తారని ఈ మూవీ నిరూపించింది. శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్లో కొన్ని వందల వేలసార్లు చూసినా సరే మళ్ళీ మళ్ళీ ఒక ఫ్రెష్ నెస్ అందజేస్తూనే ఉంటుంది. పైరసీ కోరల్లో ఇంత దారుణంగా చిక్కుకుని కూడా గొప్ప విజయం అందుకుని అరుదైన ఘనత సాధించిన సినిమాగా అత్తారింటికి దారేది ఎప్పటికీ స్పెషల్ గా ఉండిపోతుంది.