సందీప్ కిషన్.. సూపర్ సీక్వెల్

టాలీవుడ్ యువ కథానాయకుడు ఓ మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అతడి సినిమాలు కొన్ని ప్రామిసింగ్‌గా కనిపించినా.. అతడికి నిరాశనే మిగిల్చాయి. తమిళ చిత్రం ‘మైకేల్’తో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడనుకుంటే అది కూడా డిజాస్టరే అయింది. ఐతే అంతకుముందు తమిళంలో కొన్ని మంచి సినిమాలు చేయడంతో సందీప్‌కు మంచి ఆఫర్లే వస్తున్నాయి.

ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కెప్టెన్ మిల్లర్’లో అతనో కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ‘మాయవన్’ సీక్వెల్ మొదలైంది. సందీప్ కెరీర్లో ది బెస్ట్ అనదగ్గ సినిమా ‘మాయవన్’. తమిళంలో ఒకప్పుడు నిర్మాతగా చాలా బిజీగా ఉన్న సీవీ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రేక్షకులను ఆరంభం నుంచి చివరి వరకు గెస్సింగ్‌లో ఉంచే ఒక ఉత్కంఠభరిత థ్రిల్లర్ కథతో తెరకెక్కిందీ సినిమా.

ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు సందీప్ ఈ సినిమాలో. కిల్లర్ చేసే సీరియల్ హత్యలకు సంబంధించి ఒక సంచలన విషయం తెలుస్తుంది. ఆ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ‘మాయవన్’ తమిళంలో పెద్ద హిట్టయింది. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తెలుగులోకి ‘ప్రాజెక్ట్-జడ్’ పేరుతో అనువాదమైంది.

కొంచెం లేటుగా ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఆరేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ మొదలుపెట్టారు సందీప్, సీవీ కుమార్. థ్రిల్లర్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కడం తక్కువే. ‘మాయవన్’ లాంటి ఎగ్జైటింగ్ థ్రిల్లర్‌కు సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొనడం విశేషం. అప్పుడు తమిళ సినిమాగానే తెరకెక్కింది కానీ.. ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇతర కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇంకా ప్రకటించలేదు.