లెజెండరీ కమెడియన్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

తెలుగు సినిమాల్లో ఉన్నంత కమెడియన్లు ప్రపంచంలో మరే సినీ పరిశ్రమలోనూ లేరు అంటే అతిశయోక్తి కాదు. ఒక టైంలో ఒకే సినిమాలో పది మంది కమెడియన్లు పెట్టి నవ్వుల్లో ముంచెత్తేవారు జంధ్యాల, ఈవీవీ, రేలంగి నరసింహారావు లాంటి దర్శకులు. 90వ దశకం వరకు అలా ఒక వెలుగు వెలిగిన కమెడియన్లలో బాబూ మోహన్ ఒకరు. కోట శ్రీనివాసరావు కలయికలో ఆయన చేసిన కామెడీ ఎపిసోడ్లు ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాయి.

ఒక టైంలో బ్రహ్మానందంను కూడా వెనక్కి నెట్టి టాప్ కమెడియన్2‌గా వెలుగొందాడు బాబూ మోహన్. కానీ 90వ దశకం చివరికి వచ్చేసరికి ఆయన హవా తగ్గిపోయింది. కెరీర్ డౌన్ అయిన టైంలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన బాబూ మోహన్.. నెమ్మదిగా సినిమాలకు దూరం అయిపోయారు. తర్వాత ఆయన్ని అందరూ మరిచిపోయారు.

బాబూ మోహన్ తెర మీద కనిపించి చాలా ఏళ్లయిపోయింది. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి ఆయనో వెబ్ సిరీస్‌లో తళుక్కుమన్నారు. ఆ సిరీసే.. కుమారి శ్రీమతి. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో వైజయంతీ మూవీస్ వాళ్లు రూపొందించిన ఈ సిరీస్‌ను గోంటేష్ ఉపాధ్యే రూపొందించాడు. ఈ నెల 28న ఈ సిరీస్ స్ట్రీమ్ కాబోతోంది. ఈ సిరీస్ ట్రైలర్ అందరినీ అమితంగా ఆకట్టుకుంది.

తమ కుటుంబం కోల్పోయిన ఇంటిని వెనక్కి తెచ్చుకునేందుకు బార్ పెట్టాలనుకునే ఓ అమ్మాయి కథ ఇది. ట్రైలర్ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఈ ట్రైలర్లో అందరి దృష్టినీ ఆకర్షించిన జడ్జి పాత్రలో బాబూ మోహన్ కనిపించాడు. సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్నప్పటికీ.. ఆయన మళ్లీ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ట్రైలర్ చూస్తే ఈ పాత్ర బాగానే క్లిక్ అయినట్లు అనిపిస్తోంది. పూర్తి సిరీస్‌లో బాబూ మోహన్ ఇంకా బలమైన ముద్ర వేశారంటే.. మళ్లీ సినిమాల్లో బిజీ అవడం ఖాయం.