దిల్ రాజు హ్యాండ్ పడింది.. సినిమా సేఫ్

ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్లో టాప్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నాడు దిల్ రాజు. అలా అని ఆయన తనను ఇండస్ట్రీలో నిలబెట్టిన డిస్ట్రిబ్యూషన్‌ను ఏ రోజూ వదులుకోలేదు. ఓవైపు సొంత ప్రొడక్షన్లో తెరకెక్కే సినిమాల వ్యవహారాలు చూసుకుంటూనే.. ఇంకోవైపు డిస్ట్రిబ్యూషన్లోనూ తీరిక లేకుండా ఉన్నారు. టాలీవుడ్లో మంచి క్రేజున్న ఓ పెద్ద సినిమా రిలీజవుతోందంటే.. అందులో దిల్ రాజు హ్యాండ్ ఉండాల్సిందే.

అలా ఆయన గుడ్డిగా ఏమీ రైట్స్ కొనరు. మరీ రిస్క్ అనుకున్న సినిమాల జోలికి వెళ్లరు. కొన్ని సినిమాల మీద అంచనాలను మించి పెట్టుబడి పెడతారు. కానీ రిజల్ట్ చూశాక దిల్ రాజు జడ్జిమెంటే వేరు అని ఇండస్ట్రీ జనాలు ఆయన్ని కొనియాడతారు. ఇప్పుడు రాజు ఓ హిందీ చిత్రాన్ని తెలుగులో అందించబోతున్నారు. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కొత్త చిత్రం ‘యానిమల్’ తెలుగు హక్కులను రాజే తీసుకున్నట్లు సమాచారం.

‘యానిమల్’ బాలీవుడ్ మూవీనే అయినప్పటికీ.. వేరే హిందీ చిత్రాలు వేటికీ లేనంత క్రేజ్ తెలుగులో దీనికి ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ రెడ్డికి ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. కానీ అతను ఇక్కడ సినిమా తీయకుండా బాలీవుడ్‌కు వెళ్లిపోయాడు. ‘కబీర్ సింగ్’ పేరుతో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తీశాడు. ఆపై అతడి కొత్త కథతో తెరకెక్కుతున్న సినిమా ‘యానిమల్’యే.

రణబీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి హైప్ మామూలుగా లేదు. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం మంచి డిమాండే ఏర్పడింది కానీ.. రాజు మంచి రేటు పెట్టి కొనేశారు. దిల్ రాజు రిలీజ్ అంటే నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీనే. సినిమాను బాగా ప్రమోట్ చేస్తాడు. అలాగే రిలీజ్ పెద్ద రేంజిలో ఉంటుంది. వేరే ఏ రకమైన ఇబ్బందులూ లేకుండా చూసుకుంటాడు. సినిమా రీచ్ పెరుగుతుంది.