దీపావళి కూడా డబ్బింగులకు రాసిస్తారా

సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల టాలీవుడ్ నిర్మాతలు చేతులారా మంచి సీజన్లు, లాంగ్ వీకెండ్లను వదిలేసుకుంటున్నారు. మొన్న వినాయక చవితి పండక్కు డబ్బింగ్ సినిమా మార్క్ ఆంటోనీ తప్ప వేరే ఆప్షన్ లేకపోవడం థియేటర్లను ఖాళీగా ఉంచేసింది. తమిళంలో పెద్ద హిట్టు కొట్టిన విశాల్ ఎందుకో తెలుగులో మాత్రం ఈసారి ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు. పోటీ లేని అవకాశాన్ని తన చిత్రం వాడుకోలేకపోవడం చూసి హఠాత్తుగా వచ్చి సక్సెస్ మీట్లు గట్రా చేస్తున్నా ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ మళ్ళీ పికప్ అయ్యేలా చేయడం లేదు. ఆ రకంగా గణేశుడి సెలవులు వృధా అయ్యాయి.

దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావులు ఉన్నాయి కాబట్టి టెన్షన్ లేదు కానీ దీపావళికి తిరిగి డబ్బింగ్ జాతరే జరిగేలా ఉంది. ఆ పండగకు నవంబర్ 10న లాక్ చేసుకున్న మూవీ వైష్ణవ్ తేజ్ ఆదికేశవ ఒక్కటే. దీని మీద చెప్పుకోదగ్గ స్థాయిలో బజ్ లేదు. అయితే కార్తీ జపాన్, లారెన్స్ ఎస్జె సూర్యల జిగర్ తండ డబుల్ ఎక్స్ఎల్ లు అదే డేట్ కి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. రెండూ విభిన్నమైన జానర్లతో వస్తున్నవే. ఇవి కాకుండా విపరీతమైన వాయిదాలకు గురవుతూ వచ్చిన చియాన్ విక్రమ్ గౌతమ్ మీనన్ ధృవ నచ్చతీరం`సైతం టపాసుల పండగే చూస్తోందట.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే సల్మాన్ ఖాన్ ప్రెస్టీజియస్ మూవీ టైగర్ 3 అదే తేదీకి రావడం లాంచనమేనని బాలీవుడ్ టాక్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇంకో వారం పది రోజుల్లో చెబుతారట. పఠాన్, జవాన్ దెబ్బకు ఒక్కసారిగా హిందీ డబ్బింగ్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంది. వీటి మధ్య వైష్ణవ్ నెగ్గుకురావడం అంత సులభంగా ఉండదు. ఏదో స్ట్రెయిట్ మూవీ అనే జాలితో జనం థియేటర్లకు రారు. బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉందనే టాక్ వస్తే తప్ప కదలరు. సో అనువాదాల ఆధిపత్యాన్ని తట్టుకునేలా ఇంకో సినిమా ఉంటే బాగుండేది కానీ ఆ సూచనలు ప్రస్తుతానికి లేవు.