అఖిల్ ఫెయిల్.. మరి చైతూ?

హీరోల మార్కెట్‌, గత సినిమాల ఫలితాలను బట్టే కొత్త సినిమాల మీద బడ్జెట్ పెడుతుంటారు. హీరో స్టామినాకు మించి ఖర్చు చేస్తే ఏమవుతుందో చెప్పడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. హీరోగా తొలి అడుగులు వేస్తున్న అఖిల్ మీద ఏకంగా రూ.80 కోట్లు పెట్టి ‘ఏజెంట్’ సినిమా తీశాడు నిర్మాత అనిల్ సుంకర. హీరోగా పరిచయం అయ్యాక నిఖార్సయిన హిట్టే లేక ఇబ్బంది పడుతున్న హీరో మీద అంత బడ్జెట్ ఏంటి అని అడిగితే.. అఖిల్‌ కాబోయే సూపర్ స్టార్ అనుకున్నామని, ఆ ధైర్యంతోనే ఖర్చు పెట్టామని చెప్పారు అనిల్.

కానీ తీరా చూస్తే అఖిల్ ఇమేజ్ కానీ, మార్కెట్ కానీ ఏమీ మెరుగుపడలేదు. సినిమా మరీ పేలవంగా ఉండటంతో పెద్ద డిజాస్టర్ అయింది. అనిల్ సుంకరను దారుణమైన దెబ్బ కొట్టింది. ఐతే ఈ సినిమాకు బౌండ్ స్క్రిప్టు లేకుండా షూట్ మొదలుపెట్టి పెద్ద తప్పు చేశామని అనిల్ తర్వాత వివరణ ఇచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు మరో అక్కినేని యంగ్ హీరో మీద భారీ బడ్జెట్ పెట్టబోతున్నారు. నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ.. చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇది భారీ బడ్జెట్ మూవీ అనే ఇంతకముందే వార్తలు వచ్చాయి.

ఆ బడ్జెట్ గురించి అనేక ఊహాగానాలు వినిపించాయి. ఒక దశలో ఫిగర్ రూ.200 కోట్లకు వెళ్లిపోయింది. కానీ చివరగా తేలింది ఏమంటే.. ఈ చిత్రాన్ని రూ.80 కోట్ల బడ్జెట్లో తీయబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటుందీ సినిమా. కథ స్పాన్ ప్రకారం పెద్ద రేంజికి వెళ్లగల సినిమానే అంటున్నారు. కానీ చైతూ గత సినిమాల ఫలితాలే కలవరపెట్టేలా ఉన్నాయి.

కస్టడీ, థాంక్ యూ సినిమాలు ఐదు కోట్ల రేంజిని మించలేకపోయాయి. హిట్ టాక్ వచ్చినా చైతూ సినిమాలు రూ.80 కోట్ల రికవర్ చేయగలవా అన్నది ప్రశ్న. కానీ గీతా ఆర్ట్స్ అంటే ఏ లెక్కలూ వేసుకోకుండా గుడ్డిగా ఖర్చు పెట్టే సంస్థ కాదు. మార్కెట్ లెక్కలన్నీ బాగా అనలైజ్ చేసుకున్నాక.. పక్కా ప్రణాళికతోనే రంగంలోకి దిగుతారు. కాబట్టి బడ్జెట్-రికవరీ విషయాన్ని వర్కవుట్ చేశాక సిినిమాను పట్టాలెక్కించి ఉంటారని ఆశించవచ్చు. కాబట్టి అఖిల్‌కు జరిగినట్లు చైతూకు జరగదని నమ్మొచ్చు.