థియేటర్లో టీజర్ షాక్.. వీడియోలు వైరల్

కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో వ్యవహారం అంటే మామూలుగా ఉండదు. ఓం, ఎ, రా, ఉపేంద్ర లాంటి సినిమాలతో అతను ప్రేక్షకులకు ఇచ్చిన షాకులు అలాంటివిలాంటివి కావు. హీరో క్యారెక్టర్లు ఇలా కూడా ఉంటాయా.. సినిమాలు ఇలా కూడా తీస్తారా.. అని ప్రేక్షకులు షాకయ్యేలా క్రేజీగా మూవీస్‌తో సంచలనం రేపాడు ఉపేంద్ర. అతను డైరెక్ట్ చేశాడంటే ఏదో ఒక వెరైటీ ఉంటుందని ప్రేక్షకులు ఫిక్సయిపోతారు.

ఐతే వాళ్లు ఎంత ప్రిపేర్ అయి వచ్చినా.. ఊహకు అందని విధంగా ఏదో ఒకటి చేసి షాకివ్వడం ఉప్పికి అలవాటు. టైటిలే పెట్టకుండా సినిమా తీసి.. ప్రేక్షకులతో ‘సూపర్’ అనిపించుకుని రిలీజ్ తర్వాత అదే టైటిల్ ఫిక్స్ చేయడం ఉపేంద్రకే చెల్లింది. ‘ఉపేంద్ర-2’ సినిమాకు థియేటర్ల దగ్గర తలకిందులుగా కటౌట్ పెట్టించడంలోనూ ఉపేంద్ర మార్కు స్పష్టం. ఇప్పుడు తన దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం ‘యుఐ’ సినిమా విషయంలో ఉపేంద్ర తన ముద్ర చూపించాడు.

ఈ సినిమా టీజర్‌లో విజువల్సే లేకుండా కేవలం ఆడియోతో సరిపెట్టాడు. విజువల్స్ మీ ఊహకే వదిలేస్తున్నా.. మీ ఇమేజినేషన్ స్కిల్స్ చూపించండి అంటూ ఉప్పి ప్రేక్షకులకు సవాల్ విసరడం చర్చనీయాంశమైంది. ఈ వెరైటీ ఐడియా సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. విశేషం ఏంటంటే.. ఈ సినిమా టీజర్‌ను ప్రదర్శించడానికి బెంగళూరులోని ఒక థియేటర్‌ను కూడా ఎంచుకున్నారు. ఫేమస్ ఊర్వశి థియేటర్లో టీజర్ లాంచ్ పెట్టుకున్నారు. ముహూర్తం చూసి టీజర్‌ను ప్రదర్శించారు. ఐతే టీజర్ చూడ్డానికి వచ్చిన వందల మంది అభిమానులు.. ఫోన్లలో కెమెరా ఓపెన్ చేసి స్క్రీన్‌ వైపు పెట్టారు. తీరా అక్కడ చూస్తే ఆడియో తప్ప విజువలే కనిపించలేదు.

సమయం గడుస్తోంది.. దృశ్యమే రావట్లేదు. చూస్తుండగానే రెండు నిమిషాలు గడిచిపోయాయి. ఏదో టెక్నికల్ ప్రాబ్లెంతో వీడియో రాలేదేమో అని అభిమానులు గోల గోల చేశారు. కానీ చివరికి ఇది వీడియో లెస్ టీజర్ అనే విషయం అర్థమైంది. టీజర్ ప్రదర్శన అయ్యాక ఉపేంద్ర వచ్చి అసలు విషయం చెప్పాడు. టీజర్‌ను కెమెరాల్లో బంధించాలని కెమెరాలు పట్టుకుని వందల మంది స్క్రీన్ వైపు చూస్తూ.. బ్లాంక్ స్క్రీన్ ముందు అయోమయానికి గురవుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉప్పి మామూలు షాకివ్వలేదంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.