నాగచైతన్య దూతకు మోక్షం దక్కనుంది

అక్కినేని నాగచైతన్య డిజిటల్ డెబ్యూ దూత వెబ్ సిరీస్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదల ఆలస్యం చేసుకుంటూ వచ్చిన అమెజాన్ ప్రైమ్ ఎట్టకేలకు వచ్చే నెల అక్టోబర్ లో మోక్షం కలిగించబోతున్నట్టు ముంబై టాక్. మనం, 24 ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ తాలూకు ఫస్ట్ లుక్ ని ఎప్పుడో ఏడాది క్రితమే రిలీజ్ చేశారు. ఒక ఈవెంట్ లో పాత్రలను పరిచయం చేశారు. అంతే అప్పటి నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ఇదే హీరో డైరెక్టర్ కాంబోలో థాంక్ యు విడుదలై ఆల్ టైం డిజాస్టర్స్ లో చోటు దక్కించుకోవడం తెలిసిన సంగతే.

దూత దసరా కానుకగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో చైతు చాలా సీరియస్ పాత్ర పోషించాడు. ఎలాంటి కమర్షియల్, రొటీన్, రొమాంటిక్ అంశాలు లేకుండా ఇంటెన్స్ డ్రామాగా సాగుతుందట. అయితే పోస్ట్ ప్రొడక్షన్ లో జరిగిన జాప్యంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించి ఫైనల్ అవుట్ ఫుట్ సంతృప్తికరంగా లేకపోవడం వల్లే విక్రమ్ కుమార్ దాని కోసం ఎక్కువ సమయం ఖర్చు పెట్టారని ఇన్ సైడ్ టాక్. అన్ని భాషల్లోనూ ఒకేసారి వచ్చేస్తుంది కాబట్టి ఇది అన్ని కోణాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏ చిన్న తేడా వచ్చినా విమర్శలు గట్టిగా వచ్చి పడతాయి.

ఇది కాకుండా చైతు ట్రాక్ రికార్డు ఏమంత ఆశాజనకంగా లేకపోవడం కూడా ప్రైమ్ పెండింగ్ లో పెట్టడానికి కారణంగా పేర్కొంటున్నాయి  కొన్ని వర్గాలు. కస్టడీ మరీ దారుణంగా పోవడం, అది అమెజానే కొనడం గమనించాల్సిన అంశం. అవతల తమ్ముడు అఖిల్ ఏజెంటేమో డిజిటల్ లో రావడం లేదు. ఇటు అన్నయ్య దూత ఏమో అదిగో ఇదిగో అంటూ మీనమేషాలు లెక్కేస్తోంది. నాన్న నాగార్జున ఏడు నెలలు మేకప్ కి దూరంగా ఉండి నా సామి రంగాని మొదలుపెట్టారు. ఏంటో మా హీరోలకు అదేదో శాపంలా అందరినీ ఒకేసారి పీడిస్తోందని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయముంది.