దేవానంద్ 100 ఇలాంటివి మనమూ చేయాలి

కొత్త సినిమాలను చూసి వందల కోట్లు కురిపించి పరిశ్రమ పచ్చగా ఉండేలా చేయడం ఎంత ముఖ్యమో ఇప్పటి తరం చూడని క్లాసిక్స్ కి థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందివ్వడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో బాలీవుడ్ తీసుకుంటున్న శ్రద్ధను మెచ్చుకోవాలి. సుప్రసిద్ధ నటుడు దేవానంద్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ 30 నగరాల్లోని 57 మల్టీప్లెక్సుల్లో ఆయన నటించిన నాలుగు గొప్ప చిత్రాలను 4కె ద్వారా రీమాస్టర్ చేసి గ్రాండ్ ప్రీమియర్లు వేయబోతున్నారు. సెప్టెంబర్ 23 మరియు 24 తేదీల్లో దేశవ్యాప్తంగా ఈ స్క్రీనింగ్స్ ఉంటాయి. గతంలో అమితాబ్, దిలీప్ కుమార్ లకు చేశారు.

దేవానంద్ ఆణిముత్యాలు సిఐడి, జానీ మేరా నామ్, గైడ్, జువెల్ థీఫ్ లను ప్రదర్శిస్తారు. హైదరాబాద్ తో సహా ముంబై, నాగపూర్, సూరత్, అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరా, పూణే, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో ఇవి ఉండబోతున్నాయి. బుక్ మై షో ద్వారా ఆన్ లైన్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇలాంటివి మనమూ చేయాలి. దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్ లాంటి దిగ్గజాలు నటించిన ఎన్నో గొప్ప సినిమాలు టీవీ, యూట్యూబ్ లో తప్ప ఎక్కడా చూసే అవకాశం దొరకడం లేదు. వాటిని బిగ్ స్క్రీన్ మీద తరచుగా తీసుకురావాలి.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కొన్ని ఊళ్ళలో ఈ తరహా షోలు వేశారు కానీ ఏపీ తెలంగాణలో విస్తృతంగా ప్లాన్ చేసి ఉండాల్సింది. త్వరలో అక్కినేని హండ్రెడ్ ఇయర్స్ జరపబోతున్నారు. ప్రేమాభిషేకం, దేవదాస్ వగైరాలు రీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నామని నిర్మాత సుప్రియ అన్నారు. పక్కా ప్రణాళికతో ఇవి అమలు చేస్తే క్రమంగా మొన్నటి తరం నటీనటుల గొప్పదనం, అప్పటి దర్శకుల కళాత్మక విలువలు ఈ 4జి జనరేషన్ అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. మాయాబజార్ ని కలర్ చేయించడం మినహాయించి ఆ తర్వాత క్లాసిక్స్ రీ స్టోరేషన్ కు సంబంధించి ఎలాంటి కదలికకు టాలీవుడ్లో కనిపించలేదు.